Begin typing your search above and press return to search.

సియాచిన్ లో చిరంజీవి

By:  Tupaki Desk   |   9 Feb 2016 9:04 AM GMT
సియాచిన్ లో చిరంజీవి
X
సియాచిన్‌ లో అద్భుతం జరిగింది. మంచు తుపానులో చిక్కుకుని పది మంది భారత సైనికులు మృతి చెందినట్లు సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పది మంది సైనికుల్లో ఒకరైన కర్ణాటకకు చెందిన లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప మాత్రం మంచు చరియల కింద సజీవంగా దొరికారు. సంఘటన జరిగిన ఆరు రోజుల అనంతరం సుమారు 25 అడుగుల మంచు కింద హనుమంతప్ప రెస్క్యూ సిబ్బందికి సజీవంగా కనిపించాడు. మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ వాతావరణంలో ప్రాణాలతో ఉన్న హనుమంతప్పను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

- 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మంచు కింద 25 అడుగుల లోతున కూరుకుపోయిన మనిషి బతకడం కష్టం. అది కూడా ఆరు రోజులు సజీవంగా ఉండడం అన్నది అద్భుతమే. కానీ... హన్మంతప్పకు ఆ అదృష్టం దక్కింది. అసలు ఆయన ఇన్ని రోజులు ఎలా బతికి ఉన్నాడని సైనికులే ఆశ్చర్యపోతున్నారు. సైనిక శిక్షణలో నేర్పిన కొన్ని సూత్రాలు, అదృష్టం రెండూ కలిసి ఆయన ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది.

25 అడుగుల లోతున ఉన్నా మంచు చరియల మధ్య ఉన్న ఖాళీల నుంచి ఆయనకు గాలి అందింది. చలి నుంచి రక్షించే దుస్తులు మంచు ప్రభావాన్ని ఆపాయి. వీలైనంత వరకు మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల కూడా శరీరంలో వేడి నిలుస్తుంది. మొత్తానికి కారణమేదైనా కూడా హనుమంతప్ప నిజంగానే హనుమంతుడిలా చిరంజీవి అనిపించుకున్నాడు.