Begin typing your search above and press return to search.

కలాంను వ్యతిరేకించిన ఒకే ఒక్కడు

By:  Tupaki Desk   |   28 July 2015 8:25 AM GMT
కలాంను వ్యతిరేకించిన ఒకే ఒక్కడు
X
అబ్దుల్ కలాంను వ్యతిరేకించాడా...? ఎవరాయనా..? ఏ విషయంలో... ఎప్పుడు? ఎవరికైనా ఈ సందేహాలన్నీ వస్తాయి.. నిజమే.. కలాంను ఓ రాజకీయ నేత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత అయిన లాలూ.. కలాంను వ్యతిరేకించారు. రాష్ట్రపతిగా పనిచేసిన కలాం పదవీకాలం ముగిసిన తరువాత 2012లో రెండోసారి ఆయన్ను కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం చాలామంది నుంచి వచ్చింది. రాజకీయ కారణాలు ఎలా ఉన్నా అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా కలాంను కాదనగలిగే సాహసం చేయలేక... కాదంటే దేశం అంగీకరించదన్న సత్యం తెలిసి మౌనంగానే ఉంది. ఇక అప్పటికి ప్రధాన పక్షాలైన ఎస్పీ, బీఎస్పీ అధినేతలు కూడా కలాంను కాదనలేదు. బీజేపీ కలాంను కొనసాగించాలని స్పష్టంగా చెప్పింది. అయితే లాలూ మాత్రం కలాంను కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని రాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేశారు.

అయితే... ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనించిన కలాం ఎంతో హుందాతనం ప్రదర్శించారు. ఏకాభిప్రాయం లేనప్పుడు తాను ఈ పదవిలో రెండోసారి కొనసాగాలనుకోవడం లేదని చెప్పి స్వయంగా రేసు నుంచి తప్పుకున్నారు.

అయితే... దేశమంతా ఇష్టపడే కలాంను కాదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసిన లాలూ తానలా ఎందుకు డిమాండ్ చేయాల్సివచ్చిందో వివరణ కూడా ఇచ్చారు. కలాం పట్ల తనకు వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ లేదని... ఆయన ఒక విడత ఆ ఉన్నత పదవిలో ఉన్నారు కాబట్టి అన్సారీకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే తాను కలాం అభ్య్థర్థిత్వాన్ని వ్యతిరేకించానని అప్పట్లో లాలూ తెలిపారు. సోమవారం కలాం మృతిచెందిన తరువాత లాలూ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించడమే కాకుండ వివిధ ఛానళ్లతో మాట్లాడుతూ కలాం గొప్పదనాన్ని, దేశానికి ఆయన ఇచ్చి వెళ్లిన స్ఫూర్తిని మననం చేసుకున్నారు.