Begin typing your search above and press return to search.

పిల్ల కాంగ్రెస్ టీడీపీనే..బాబే పెద్ద‌ న‌టుడు

By:  Tupaki Desk   |   24 May 2018 1:56 PM GMT
పిల్ల కాంగ్రెస్ టీడీపీనే..బాబే పెద్ద‌ న‌టుడు
X
చంద్రబాబును మించిన నటుడిని తానెప్పుడు చూడలేదని దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి లక్ష్మీపార్వతి అన్నారు. సినీనటులు పొట్టకూటి కోసం వేషాలు వేసుకుంటే.. చంద్రబాబు మాత్రం అవినీతిని కాపాడుకోవడం కోసం - తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో పార్టీతో పొత్తుపెట్టుకుంటాడని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ను మరోసారి మోసం చేస్తూ ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కేవలం తన స్వార్థం కోసమే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నో తప్పటడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్‌ తో ఎలా కలిసిపోయారో అందరూ చూశారన్నారు. కాంగ్రెస్‌ తో చంద్రబాబు ఎన్నో లోపాయికారి ఒప్పందాలున్నందున ఇప్పటినుంచి టిడిపిని పిల్ల కాంగ్రెస్‌ అని పిలవాలని ఆమె అన్నారు. అంతేకాదు పిల్ల కాంగ్రెస్ - పిల్ల బీజేపీ - పిల్ల కమ్యూనిస్ట్ అన్నీ చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా - అశాస్త్రీయంగా విభజించారంటూ 2014 ఎన్నికలకు ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో అదే పార్టీతో పొత్తు పొట్టుకునే విధంగా సంకేతాలు పంపడం సిగ్గుచేటని లక్ష్మీపార్వతి అన్నారు. సోనియా గాంధీని ఇటలీ దయ్యం అని తిట్టిన చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్‌ తో పొత్తుకు ఉవ్విళ్లూరుతున్నారని ఆమె మండిప‌డ్డారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజల వ్యతిరేక‌తతో చంద్రబాబు కూటమి నుంచి బయటకొచ్చారని పేర్కొన్నారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు కాంగ్రెస్‌ తో కలవడానికి ప్ర‌యత్నిస్తున్నారని, ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని లక్ష్మీ పార్వతి మండిప‌డ్డారు.కుమారస్వామి ప్రమాణ స్వీకార సభలో సోనియా గాంధీకి ఒంగి ఒంగి దండాలు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీకి చెవిలో చెప్పడం.. ఆయన వద్దకు వెళ్లి మరీ మాట్లాడేందుకు ప్రయత్నించడం చూస్తుంటే చంద్రబాబు దిగజారుడుతనం బయటపడిందని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పార్టీలన్నీ కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకుంటున్న పార్టీలేనని.. అందుకే చంద్రబాబు కూడా ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ తో పోరాడేందుకు దివంగత ఎన్టీఆర్‌ పార్టీని స్థాపిస్తే అదే కాంగ్రెస్‌ తో బాబు అంటకాగడం సిగ్గుచేటని ల‌క్ష్మీపార్వ‌తి మండిప‌డ్డారు. తెలుగుదేశం పార్టీ పేరు మార్చి చంద్రబాబు పార్టీ అని పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ఫొటోను కూడా వాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ను వ‌దిలి వెళ్లాడని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికి మద్ధతు తెలుపుతామని జగన్‌ మొదట్నుంచి చెబుతున్నారని.. ఇప్పుడూ అదే చెబుతామని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పారు.