Begin typing your search above and press return to search.

జీవ‌న్ రెడ్డికి ల‌గ‌డ‌పాటి ఫోన్

By:  Tupaki Desk   |   10 Dec 2018 10:18 AM GMT
జీవ‌న్ రెడ్డికి ల‌గ‌డ‌పాటి ఫోన్
X
తెలంగాణ‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మిదే విజ‌య‌మంటూ ల‌గ‌డజాటి రాజ‌గోపాల్ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ లెక్క‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. జాతీయ స్థాయి సంస్థ‌ల ఎగ్జిట్ పోల్స్ కు ల‌గ‌డ‌పాటి లెక్క‌ల‌కు భారీ తార‌త‌మ్యం ఉండ‌టంపై ప‌లు విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. మ‌రి ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో నిజ‌మెంతో మ‌రో 24 గంట‌ల్లో తేలిపోనుంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత - జ‌గిత్యాల అభ్య‌ర్థి జీవ‌న్ రెడ్డికి ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి ఫోన్ చేయ‌డం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. జీవ‌న్ రెడ్డికి ల‌గ‌డ‌పాటి ఆదివారం ఫోన్ చేశారు. ఆ స‌మ‌యంలో యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లను కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి జీవ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్నారు.

ల‌గ‌డ‌పాటి నుంచి ఫోన్ రావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి ఆయ‌న‌తో జీవ‌న్ రెడ్డి కొంత‌సేపు ముచ్చ‌టించార‌ట‌. ఆ త‌ర్వాత ల‌గ‌డ‌పాటి తాను ఎందుకు ఫోన్ చేశారో చెప్పార‌ట‌. అన్నా నువ్ గెలుస్తున్నావ్‌.. కంగ్రాట్స్! అని అభినందించార‌ట‌. తెలంగాణ‌లో ప్ర‌జా కూట‌మి గెలుస్తుంద‌న్న త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను పున‌రుద్ఘ‌టించార‌ట‌. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక నీకు మంత్రి ప‌ద‌వి కూడా వ‌స్తుంద‌న్నా అంటూ మ‌రో సంతోష‌క‌ర విష‌యం చెప్పార‌ట‌. అనంత‌రం తన మ‌ద్ద‌తుదారులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో ల‌గ‌డ‌పాటి ఫోన్ విష‌యాన్ని జీవ‌న్ రెడ్డి పంచుకున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద కార్య‌క‌ర్త‌లు చాలా సేపు సంబ‌రాలు చేసుకున్నార‌ట‌.

ఇదిలా ఉంటే.. జీవ‌న్ రెడ్డి గెలిస్తే ఎక్కువ‌గా చింతించేది గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కుమార్తె క‌వితేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో జీవ‌న్ రెడ్డి గెలుపును అడ్డుకునేందుకు ఆమె తీవ్రంగా ప్ర‌య‌త్నించ‌డ‌మే అందుకు కార‌ణం. టీఆర్ఎస్ అభ్య‌ర్థి సంజ‌య్ కుమార్ త‌ర‌ఫున ఆమె గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌చారం చేశారు. త‌న తండ్రికి బ‌ద్ధ శ‌త్రువైన జీవ‌న్ రెడ్డిని ఓడించేందుకు చాలా వ్యూహాలు ర‌చించారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో జీవ‌న్ రెడ్డి ఓట‌మి ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వేలు అంచ‌నా వేశాయి. ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి జీవ‌న్ రెడ్డికి ఫోన్ చేయ‌డంతో జ‌గిత్యాల‌లో విజ‌యం ఎవ‌రిద‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.