Begin typing your search above and press return to search.

గాలిని అరెస్ట్ చేయించింది ఆ సీఎం అంట‌

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:36 PM GMT
గాలిని అరెస్ట్ చేయించింది ఆ సీఎం అంట‌
X
వివాదాస్పద మైనింగ్ వ్యాపారి - కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించిన సంగ‌తి తెలిసిందే. ఇస్లామిక్ బ్యాంకింగ్ పేరిట రూ.954కోట్ల వరకు జరిగిన పోంజి స్కాం కేసు నుంచి నిందితులైన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని సయ్యద్ అహ్మద్ ఫరీద్ - అతడి కుమారుడిని బయటపడేసేందుకు ప్రయత్నించినట్లు జనార్దన్‌ రెడ్డిపై అభియోగాలున్నాయి. మూడురోజులు జనార్దన్‌ రెడ్డి అదృశ్యమవడంతో ఆయన పారిపోయినట్లు ప్రచారం జరిగింది. జనార్దన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుండగా, ఒక్కరోజు ముందే ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. జనార్దన్‌ రెడ్డితోపాటు మరో నిందితుడు అలీఖాన్‌ నూ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు న్యాయమూర్తి జగదీశ్ ఈ నెల 24వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

అయితే, ఈ ఎపిసోడ్ వెనుక ఓ సీఎం కీల‌క పాత్ర ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌నే, ప్ర‌స్తుత క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామి. నాటకీయంగా బెంగళూరులోని సీసీబీ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి వచ్చిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తాను నిరపరాధినని - రాజకీయ కుట్రతోనే తనను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాకు చెప్పారు. గాలి ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా....ఈ గాలి జైలుపాలు అవ‌డం వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉందంటున్నారు ప‌రిశీల‌కులు. 2006లో గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి - కుమార‌స్వామి మ‌ధ్య వైరానికి బీజం ప‌డిందంటున్నారు. 2006లో ఎమ్మెల్యేగా ఉన్న కుమారస్వామి ముఖ్యమంత్రి అవడం కోసం ఇద్దరు బీజేపీ నాయకులు, తన జేడీఎస్‌ పార్టీకి చెందిన ఓ యువజన నాయకుడి స‌హాయంతో ధరమ్‌ సింగ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

బీజేపీతో క‌లిసి స‌ర్కారును ఏర్పాటు చేసిన కుమారస్వామి బీజేపీకి నిధులు సమకూర్చే నాయకుడిగా ముద్రపడిన గాలి జనార్దన్‌ రెడ్డిని ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే, కొద్దికాలానికి వీరిద్దరి మ‌ధ్య పొరాపొచ్చాలు వ‌చ్చాయి. దీంతో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కుమారస్వామి మైనింగ్‌ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారంటూ గాలి జనార్దన్‌ ఆరోపించడం - అనంత‌రం కొద్దికాలానికి సీఎం పదవికి కుమార‌స్వామి రాజీనామా చేశారు. అయితే, దీనిపై ర‌గిలిపోయిన కుమార‌స్వామి ‘నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పట్టుమని ఐదు నెలలు కూడా కాలేదు. నా సంకీర్ణ భాగస్వామ్య పక్షం నాయకుడే నాపై అవినీతి ఆరోపణలు చేశారు. నేనా విషయాన్ని నా జీవిత కాలంలో ఎన్నడూ మరవను’ అని ప్ర‌క‌టించారు. అంత‌టి ప‌గ‌తో ర‌గిలిపోయిన కుమార‌స్వామి ఇటీవ‌ల బీజేపీతో క‌లిసి స‌ర్కారు ఏర్పాటుకు కూడా ముందుకు సాగ‌లేదు. అదే స‌మ‌యంలో తాజాగా జ‌రిగిన ఉదంతంలో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి జైలు పాలు చేసేందుకు ద‌క్కిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని ఆయ‌న త‌న ప‌గ‌కు సంబంధించిన ఫ‌లితాన్ని రుచి చూపించార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

ఇదిలాఉండ‌గా, తాజా కేసులో జనార్దన్‌ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ కోరారు. తిరస్కరించిన జడ్జి.. సిటీ సివిల్ కోర్టులో మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనార్దన్‌రెడ్డికి, అలీఖాన్‌లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. తర్వాత వారిని పోలీసులు బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ జైలులో జనార్దన్‌ రెడ్డిని ఉంచడం ఇది మూడోసారి. గతంలో అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేసినప్పుడు ఉంచిన ఒంటరి గ‌దిలోనే ఈసారి కూడా ఆయ‌న్ను ఉంచారు.