Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కొండా ఫ్యామిలీ...అదొక్క‌టే స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   26 Sep 2018 4:29 AM GMT
ఢిల్లీలో కొండా ఫ్యామిలీ...అదొక్క‌టే స‌మ‌స్య‌
X
తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు బుధ‌వారం తెర‌ప‌డ‌నుంది. టీఆర్ఎస్‌కు చెందిన క‌ల‌క‌లం తారాస్థాయికి చేరింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అయితే కేసీఆర్ ఆమెను కరుణించలేదు. దీంతో మనస్తాపం చెందిన సురేఖ టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేస్తూ నిప్పులు చెరిగారు. అయితే అనూహ్య రీతిలో ఢిల్లీకి వెళ్లారు. త‌న భ‌ర్త కొండా ముర‌ళితో క‌లిసి కాంగ్రెస్ పెద్ద‌ల‌తో సురేఖ స‌మావేశం అయ్యారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే స్వార్థ‌ప్ర‌యోజ‌నాలే ఎక్కువ అని సురేఖ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. సినీనటుడు - తెలుగుదేశం నేత నందమూరి హరికృష్ణ స్మారక స్థూపం కోసం ఎవడబ్బ సొమ్మని తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని కొండా సురేఖ ప్రశ్నించారు. టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం - కేసీఆర్‌ కు రాసిన బహిరంగ లేఖలో ఆమె పలు విమర్శలు గుప్పించారు. హరికృష్ణ స్మారకానికి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనేమీ తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదని - కేసీఆర్‌ కు చుట్టమేమీ కాదని - అమరవీరుల కుటుంబ సభ్యుడు అంతకన్నా కాదని - స్థలాన్ని ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. హరికృష్ణ మరణించిన నిమిషాల వ్యవధిలోనే - కేసీఆర్ - ఆయన కుమారుడు కేటీఆర్ - అక్కడికి వెళ్లారని - అంత్యక్రియలు పూర్తయ్యే దాకా కేటీఆర్ అక్కడే ఉన్నారని గుర్తు చేసిన ఆమె - తెలంగాణ భూమిని ధారాదత్తం చేశారని మండిపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ - మాజీ సీఎం టీ అంజయ్య భార్య మణెమ్మ చనిపోతే పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరిక లేకపోయిందని నిప్పులు చెరిగారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోతే వారిని కూడా ఓదార్చేందుకు కేసీఆర్ రాలేదని కొండా సురేఖ దుయ్యబట్టారు.

ఇలా విరుచుకుప‌డిన సురేఖ దంప‌తులు ఢిల్లీకి చేరుకున్నారు. బుధ‌వారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్‌ తో భేటీ అయ్యారు. అనంతరం రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు వివ‌రించారు. అయితే, మూడు సీట్ల విష‌యంలోనే పీట ముడి ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొండా సురేఖ దంప‌తులు కోరిన‌ట్లు మూడు సీట్లిస్తారా లేక రెండు కేటాయిస్తారా అనేది స‌స్పెన్స్‌ గా ఉందంటున్నారు.