Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ స్థానంలో కొండా సురేఖ‌..కేసీఆర్ డ్రీమ్‌

By:  Tupaki Desk   |   27 March 2017 10:05 AM GMT
స్పీక‌ర్ స్థానంలో కొండా సురేఖ‌..కేసీఆర్ డ్రీమ్‌
X
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న ఒక‌టి ద‌ర్శ‌న‌మిచ్చింది. పార్టీ ఏదైనా ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ అనే పేరున్న సీనియ‌ర్ నాయ‌కురాలు కొండా సురేఖ స్పీక‌ర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా చైర్‌ లో సురేఖ ఉన్నారు. సభ ప్రారంభమైనప్పుడు చైర్‌ లో స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి సభలో లేకపోవడంతో కొండా సురేఖ ప్యానల్ స్పీకర్‌ గా వ్యవహరించారు. శాసనసభ స్పీకర్ చైర్‌ లో ప్యానల్ స్పీకర్‌ గా టీఆర్‌ ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ దర్శనమివ్వ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

అనంత‌రం సీఎం కేసీఆర్ స‌భ‌లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ నా డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఇండియాలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో విద్యా విధానం అమలు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. కేజీ టు పీజీ ప్రాజెక్టులో పటిష్టమైన అడుగు ముందుకు వేశామని, అయితే ఇంకా ప్రారంభ దశలోనే ఉందని కేసీఆర్ ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్టును పూర్థి స్థాయిలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుందన్నారు.

గతంలో ఎన్నుడూ లేని విధంగా ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు. ఎస్సీ విద్యార్థినుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామ‌ని, త్వరలోనే గురుకులాల్లో 24 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నామని ప్రకటించారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ర్టంలోని 50 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించడం గత పాలకుల వైఫల్యం కాదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/