Begin typing your search above and press return to search.

పార్టీ ఇన్‌ ఛార్జ్ అయితే.. ఏం చెప్పినా వినాలా?

By:  Tupaki Desk   |   16 Aug 2017 7:28 PM GMT
పార్టీ ఇన్‌ ఛార్జ్ అయితే.. ఏం చెప్పినా వినాలా?
X
అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అతి ఎక్కువ‌గా ఉండే నాయ‌కులకు కేరాఫ్ అడ్ర‌స్‌... కాంగ్రెస్‌. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ పేరుతో బాజాప్తా బాస్ స్థానంలో ఉన్న వాళ్ల‌ను కూడా ఏకి ప‌డేయడానికి పెట్టింది పేర‌యిన నేత‌ల‌కు నెల‌వు అయిన‌ కాంగ్రెస్ పార్టీలోని లుక‌లుక‌లు మ‌రోమారు బ‌య‌ట‌ప‌డ్డాయి. త‌మతో స‌రిస‌మాన‌మైన నాయ‌కుల‌ను ఏకిప‌డేయ‌డం వంటి చ‌ర్య‌లు కాకుండా ఈ ద‌ఫా మ‌రో ద‌శ ముందుకు ప‌డి ఏకంగా అధిష్టానం పెట్టిన ఇంచార్జీ పైనే విరుచుకుప‌డే స్థాయికి ఈ స్వేచ్ఛా గానాలు చేరాయి. కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత నాయ‌కుల్లో రెబెల్ లీడ‌ర్స్‌గా పేరుప‌డిన న‌ల్ల‌గొండ బ్ర‌ద‌ర్స్ కోమ‌టిరెడ్డి రెడ్డి వెంక‌ట‌రెడ్డి - కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌మ గొంతు మ‌ళ్లీ విప్పారు. ష‌రా మామూలుగా త‌మ ప్ర‌త్య‌ర్థి, పీసీసీ అధ్య‌క్షుడైన ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని త‌క్కువ చేస్తూనే ఇటీవలే అపాయింట్ అయిన తెలంగాణ వ్యవ‌హారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియా లైట్ తీసుకునే కామెంట్లు చేశారు.

కోమ‌టిరెడ్డి సోద‌రుల్లో ఒక‌రైన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి న‌ల్ల‌గొండ‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటుంద‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మార్పు తప్పదని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. పార్టీ ఇంచార్జీ అయినంత మాత్రాన సీనియ‌ర్ల‌తో సంబంధం లేకుండా తీసుకునే నిర్ణ‌యం చెల్ల‌బోద‌ని తేల్చిచెప్పారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అనే అధికారం కుంతియాకు లేదని, ఆ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. సరైన సమయంలో అధిష్టానం, స‌రైన‌ నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాబోయే ఎన్నిక‌ల‌కు యువ‌నాయ‌క‌త్వం సార‌థ్యంలో వెళ్లాల్సి ఉంద‌నే విష‌యాన్ని నొక్కిచెప్తూ త్వ‌ర‌లోనే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

న‌యీమ్‌ ఎన్‌ కౌంటర్ జరిగిన ఏడాది అవుతున్న బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం వైఫ‌ల్యం చెందింద‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మండిప‌డ్డారు. నయిమ్ ఆస్తులు కొట్టేయడానికే ఎన్‌కౌంటర్ చేశార‌ని ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి ఆరోపించారు. నయిమ్ డైరీ డబ్బులు లెక్క చెప్పకుండా ప్రజలను, బాధితులను మోసం చేస్తున్నారని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఒక్క నయిమ్ చంపి వందమంది నయిమ్ లను తయారు చేశారని ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆరోపించారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో త‌న‌ను ఓడించడానికి మంత్రి జగదీష్ రెడ్డి నయిమ్ మద్దతుతో చాలా మంది ప్రజా ప్రతినిధులు భయబ్రాంతులకు గురిచేశార‌ని ఆయ‌న ఆరోపించారు.