Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ కామెడీ చేస్తున్నారంటున్న బ్ర‌ద‌ర్స్

By:  Tupaki Desk   |   21 Feb 2017 11:27 AM GMT
ఉత్త‌మ్ కామెడీ చేస్తున్నారంటున్న బ్ర‌ద‌ర్స్
X
అంత‌ర్గ‌త స్వేచ్ఛ అత్య‌ధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో స‌ర్వే చిచ్చు రేపింది. ఇటీవల పీసీసీ సార‌థి ఉత్త‌మ్ కుమార్ వెల్లడించిన సర్వే కాంగ్రెస్‌ పార్టీలో వేడెక్కించింది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కాం గ్రెస్‌ పార్టీకి సునాయాసంగా 50 సీట్లు వస్తాయని, మరికొంత కష్టపడితే మరో 20 స్థానాలు గెలుచుకుంటామని వెల్లడించారు. దీనిని ఆపార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు విభేదించారు. బహిరంగంగా కాకపోయినా తమ అభిప్రాయాన్ని అంతర్గతంగా చర్చించుకున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఉతమ్‌ కుమార్‌ రెడ్డి సర్వేను బహిరంగంగా తూర్పార బట్టారు. ఉత్తమ్‌ సర్వే ఫలితాలపై విశ్వాసం లేదని, తన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీకి 80 సీట్లు వస్తాయని తేలిందని చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ గెలుస్తుందని లీకులు ఇవ్వాలి తప్ప పార్టీ ఓడిపోతుందని లీకులు ఇవ్వడం కామెడీ కాక మ‌రేమిట‌నీ కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించారు. నకిరేకల్‌ - భువనగిరి - నల్లగొండ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోతుందన్న సర్వే ఫలితాలను తప్పు పట్టానని, వాటిపై తమకు నమ్మకం లేదనని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. కార్యకర్తల కోరికమేరకు తాను స్పందించాల్సి వచ్చిందన్నారు.

కాగా, ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే, మరోవైపు అధ్యక్ష పదవికోసం ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయ‌ని అంటున్నారు. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం చేయని వారు లేరని టాక్ వినిపిస్తోంది. అధ్యక్ష పీఠం చేజారిపోకుండా ఉండేందుకు ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తూ ఏదో ఒక కార్యక్రమంతో దృష్టంతా తనవైపు చేసుకున్నారు. అయితే తాజా స‌ర్వేతో ఆయ‌న కొత్త వివాదాన్ని త‌న మీద వేసుకున్న‌ట్ల‌యింద‌ని అంటున్నారు. దీనిపై విమ‌ర్శించిన కోమటిరెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణను తప్పారని, టీఆర్‌ ఎస్ పార్టీ ట్రాప్‌ లో పడ్డారని ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు పార్క్‌ హయత్ హోటల్లో దిగ్విజయ్‌ సింగ్‌ తో కోమటిరెడ్డి బ్రదర్స్‌(వెంకట్‌ రెడ్డి - రాజగోపాల్‌ రెడ్డి) భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు చర్చించారు. అధ్యక్షుడి చేసిన సర్వేపై ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఆయన వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

పార్టీ మారే ఉద్దేశమే ఉంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారం లోకి తీసుకువస్తానని ఎలా చెబుతానని చెప్పినట్టు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ దిగ్విజ‌య్ సింగ్‌ తో చెప్పిన‌ట్లు తెలిసింది. సర్వేను లీకు చేసి - తనకు మద్దతుగా ఉన్న స్థానాల్లో పార్టీ ఓడిపోతుందని చెప్పడాన్నే వ్యతిరేకించానని చెప్పుకున్నట్టు స‌మాచారం. జానారెడ్డి - ఉత్తమకుమార్‌ రెడ్డిలతో కలిసి భోజనం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు వివ‌రిస్తున్నారు. అసెంబ్లీలో టీఆర్‌ ఎస్‌ పార్టీపైనా, ముఖ్యమంత్రి పైనా చేసిన విమర్శల క్లిప్పింగ్‌ లను కూడా దిగ్విజయ్‌ సింగ్‌ కు చూపించినట్టు తెలిసింది. వాదనలు విన్న తర్వాత దిగ్విజయ్‌ సింగ్‌ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని సూ చించినట్టు తెలిసింది. ఈ చర్చను ఇంతటి వదిలేయాలని, పార్టీ వ్యవహారం అంతర్గతం విషయమని, దాన్ని తాము పరిష్కరించుకుంటామని సమావే శానంతరం దిగ్విజరు విలేకరులకు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/