Begin typing your search above and press return to search.

కోదండ‌రాం కొత్త ఎజెండాను ఎత్తుకున్నారు

By:  Tupaki Desk   |   19 Jun 2017 9:28 AM GMT
కోదండ‌రాం కొత్త ఎజెండాను ఎత్తుకున్నారు
X
తెలంగాణ ప్ర‌భుత్వంలోని లోటుపాట్లు ఎత్తి చూప‌డం - ప్ర‌జాస్వామ్య‌యుత‌మైన అంశాల‌పై ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం అనే అజెండాతో ముందుకు సాగుతున్న తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఈ క్ర‌మంలో మ‌రో కొత్త ఎజెంండాను ఎత్తుకున్నారు. కొద్దికాలం క్రితం తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేయాల‌ని గ‌ళం విప్పి - ఆ త‌దుప‌రి భూ కుంభ‌కోణం వంటి అంశాల‌పై పోరాటం చేసిన కోదండ‌రాం తాజాగా అమ‌రుల ఆకాంక్ష సాధ‌న కోసం కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర వ్యాప్త యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన పేరుతో ఈనెల 21న “అమరుల స్ఫూర్తి యాత్ర”ను తెలంగాణ జేఏసీ చేపడుతోంది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో అసువులు బాసిన వారి ఆకాంక్ష‌లు ఫ‌లించేలా ప్ర‌భుత్వ ప‌రిపాల‌న ఉండాల‌ని కోరుతూ చేప‌డుతున్న ఈ యాత్ర మొదటి దశలో భాగంగా సంగారెడ్డి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జేఏసీ ప్రతినిధులు హాజరుకానున్న ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే వివిధ జిల్లాల్లో జేఏసీ సన్నాహాక సదస్సులను నిర్వహిస్తోంది. యాత్ర ఏర్పాట్లపై జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్ర సన్నాహాక ఏర్పాట్లు - ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధానమైన సమస్యలు తదితర అంశాల పై చర్చించినట్లు తెలిసింది. సంగారెడ్డిలో యాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూ నిర్వాసితులు కూడా హాజరు అయ్యేలా చూడ‌నున్న‌ట్లు స‌మాచారం. యాత్ర సబ్ కమిటీ బృందం కూడా సన్నాహాక ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ప్రధానంగా యాత్రలో పాల్గొనే వాహణ శ్రేణి - జిల్లా ప్రతినిధుల పాత్ర - పోలీసు అనుమతులు ఇలా పలు అంశాలపై సమీక్షిస్తున్నారు. ప్రధానంగా నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో టీఆర్‌ ఎస్ ప్రభుత్వ మూడేళ్ల పనితీరును - స్థానిక సమస్యలు - భూ నిర్వాసితులు - నిరుద్యోగ సమస్యలను ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు.

ఈనెల 21న సంగారెడ్డి నుంచి ప్రారంభయ్యే “అమరుల స్ఫూర్తి యాత్ర” సదాశివపేట - కోహిర్ - జహీరాబాద్ - గంగ్వార్ చౌరస్తాతో ముగుస్తుంది. మరుసటి రోజు 22న నారాయణ్‌ ఖేడ్ - ఆందోల్ - జోగిపేట - నర్సాపూర్ - కౌడిపల్లి వరకు 23న మెదక్ - శంకరంపేట - చేగుంట - నార్సింగి - రామాయంపేట - నర్సంపేట తండా - 24న నిజాంపేట్ - పోతరెడ్డిపల్లి - భూంపల్లి క్రాస్‌రోడ్ - హబ్బీపూర్ క్రాస్ రోడ్ - దుబ్బాక - దుంపలపల్లి - తిమ్మాపూర్ - సిద్ధిపేట వరకు కొనసాగనుంది. “అమరుల స్ఫూర్తి యాత్ర” నిర్వహణ సబ్‌ కమిటీ నాలుగు రోజుల యాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వీలును బట్టి అదనంగా ఇతర ప్రాంతాలలో కూడా పర్యటించే విషయమై నిర్ణయం తీసుకోనుంది.ఈ యాత్ర త‌ర్వాత అమ‌రుల కుటుంబాల సంక్షేమంపై చ‌ర్చ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/