Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు ఎంత ఆరాచకమంటే..

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:51 AM GMT
కేసీఆర్ సర్కారు ఎంత ఆరాచకమంటే..
X
నిరుద్యోగ నిరసన ర్యాలీ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ర్యాలీని అడ్డుకోవటం.. ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయటం లాంటి అంశాలపై ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. నిరసన ర్యాలీని అడ్డుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో తెలుసా? అంటూ ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

నిరుద్యోగుల నిరసన ర్యాలీని అడ్డుకున్న తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలుచేసిన కోదండం.. ప్రభుత్వ తీరును తప్పు పట్టటంతో పాటు.. రానున్న రోజుల్లో తామేం చేయనున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చెప్పుకొచ్చిన ఆయన.. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ఆందోళనల్ని.. పోరాటాల్ని చేయనున్నట్లు వెల్లడించారు.

కోదండం మాష్టారు చేసిన వ్యాఖ్యల్లో కీలక అంశాలు చూస్తే..

= ప్రశ్నించేవాళ్లు ఉండకూడదన్నట్లుగా ప్రభుత్వంలో ఉన్న వారు కోరుకుంటన్నారు.

= ప్రశ్నించేవాళ్లు ఉండకూడదని ప్రభుత్వం కోరుకున్నా.. మేం గాలికి కొట్టుకుపోయే వాళ్లం కాదు.

= ఎన్ని నిర్బంధాలు విధించినా.. పోరాటాలు మాత్రం ఆగేది లేదు.

= నిరుద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని.. ఆ తీవ్రతను ప్రపంచానికి చెప్పాలన్న లక్ష్యం సంపూర్ణంగా నెరవేరింది.

= శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదు. అర్థరాత్రి అరెస్ట్ లు చేయటం అత్యంత దారుణం.

= అర్థరాత్రి మా ఇంటికి వచ్చి తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు.. అవసరం ఎందుకు వచ్చాయో చెప్పాలి

= మమ్మల్ని ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారన్న విషయం కూడా తెలియజేయకూడదని ఎందుకు అనుకున్నారు? అంత రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది?

= ఉస్మానియా.. కాకతీయవర్సిటీల్లోని హాస్టళ్ల వద్ద సాయుధ బలగాల్ని పెట్టారు.

= జేఏసీ తెర మీదకు తీసుకొచ్చిన అంశంపై పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. మేం సంపూర్ణ విజయం సాధించాం.

= పోలీస్ స్టేషన్లో ఉన్న మమ్మల్ని కలవటానికి వచ్చిన పార్టీ నేతల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయటం అత్యంత దుర్మార్గం.

= ఐదు వేల మందిని అరెస్ట్ చేశారు. వేలాదిమంది పోలీసుల్ని మొహరించారు. ఇది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో ప్రభుత్వానికి తర్వాత తెలుస్తుంది.

= స్వామి అగ్నివేశ్.. యోగేంద్ర యాదవ్.. ప్రశాంత్ భూషణ్ లాంటి వారు మాకు ఫోన్లు చేసి.. టీఆరఎస్ ప్రభుత్వ తీరును ఖండించారు.

= భూనిర్వాసితుల సమస్యలపై త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/