Begin typing your search above and press return to search.

ఢిల్లీకి నేత‌లు...కోదండ‌రాం పార్టీకి స‌ర్వం సిద్ధం

By:  Tupaki Desk   |   14 Jan 2018 12:53 PM GMT
ఢిల్లీకి నేత‌లు...కోదండ‌రాం పార్టీకి స‌ర్వం సిద్ధం
X
తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై మ‌రో పార్టీ ఏర్పాటు కానుందా? ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేసిన జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధ‌మైందా? ఏకంగా ముహూర్తం ఖ‌రారైందా? ఢిల్లీలో ఇందుకు త‌గిన ప్ర‌క్రియ జ‌రుగుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వస్తోంది. జేఏసీలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ గురించి జేఏసీలోని కొందరు ముఖ్యనేతలు త్వరలోనే ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 3 లేదా 4వ తేదీన జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి కోదండరామ్ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

తాజాగా, టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో శనివారం జరిగింది. టీజేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని ఫిబ్రవరి 3 లేదా 4వ తేదీలో హైదరాబాద్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెల్లడైన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణను ప్రకటించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా జేఏసీ నిర్మాణం, రైతు అధ్యయన యాత్రలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు గోపాల్‌శర్మ అరెస్టు పరిణామాలపై వారు చర్చించారు.రైతు అధ్యయన యాత్రలు దాదాపుగా పూర్తయ్యాయని, మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడాఈ నెల 20 తేదీ లోపు పూర్తి చేయాలని, ఈ నెల 22 నుంచి30వరకు ఉమ్మడి పది జిల్లా లో అధ్యయనంలో తేలిన అంశాలపై చర్చించేందుకు సదస్సులను నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ తీర్మానించింది.

ఇటీవ‌ల జ‌రిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలోనే పార్టీ పెడుతున్నట్టు జేఏసీ శ్రేణులకు కోదండరాం సంకేతాలు అందజేసిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా జేఏసీ ప్రతినిధుల బృందం క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. వివిధ జిల్లాలోని కొందరు రాజకీయ ముఖ్యనేతలతో జేఏసీ ప్రతినిధులు చర్చించారు. ఎన్నికలకు గడువు దగ్గరపడడం, మరో వైపు పార్టీ ఏర్పాటుపై జేఏసీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నుంచి కోదండరాంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయాలని ఆయన భావిస్తున్నారు.రాజకీయ పార్టీ విధి విధానాలు, తదితర అంశాలపై పలువురు ముఖ్యులతో ఆయన చర్చిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇది వరకే కోదండరాంతో చర్చలు జరిపారు.

కాగా, తెలంగాణ జేఏసీ, రాజకీయ పార్టీ రెండూ వేర్వేరుగా కొనసాగాలని భావిస్తున్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి కల్పన, భూ నిర్వాసితుల సమస్యలే పార్టీ ప్రధాన ఎజెండాగా ఉంబోతున్నట్లు జేఏసీ నేతలు చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు అసంతృప్త నేతలు కూడా కోదండరాం ఏర్పాటు చేసే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న మ‌రికొంద‌రు నేత‌లు సైతం పార్టీలో చేరుతార‌ని అంటున్నారు.