Begin typing your search above and press return to search.

కిర్లంపూడిలో అందరూ ముద్ద ముట్టటం లేదా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 9:08 AM GMT
కిర్లంపూడిలో అందరూ ముద్ద ముట్టటం లేదా?
X
కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేయటం తెలిసిందే. ముద్రగడతో పాటు ఆయన సతీమణి కూడా తమ సొంతూరు అయిన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో దీక్ష చేస్తున్నారు. గత మూడు రోజలుగా జరుగుతున్న ఈ దీక్షకు సంబంధించి ఒక ఆసక్తికర కోణం బయటకు వచ్చింది. ముద్రగడ.. ఆయన సతీమణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దుతుగా కిర్లంపూడిలో కాపు సామాజిక వర్గం వారితోపాటు.. మిగిలిన సామాజిక వర్గాలు కూడా అప్రకటిత దీక్ష చేస్తున్నట్లు చెబుతున్నారు.

గడిచిన మూడు రోజులుగా కిర్లంపూడి గ్రామంలోని ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదన్న మాట వినిపిస్తోంది. గ్రామంలో ఎవరికి ఏం జరిగినా అండగా ఉండే ముద్రగడ లాంటి నేత ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే.. తాము సైతం అంటూ అన్ని వర్గాల ప్రజలు ఆయనకు సంఘీభావంగా ముద్ద ముట్టటం లేదన్న మాట చెబుతున్నారు. అయితే.. ఇందులో నిజానిజాలపై ఎవరూ నోరు విప్పటం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నిరాహారదీక్ష చేస్తున్న మాట నిజమేనని.. కాకుంటే ఒక్కఇంట్లో కూడా పొయ్యి వెలగలేదన్నది అతిశయోక్తి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. కులాలకు అతీతంగా ఆ మాత్రం స్పందన గొప్ప విషయమేనని చెప్పక తప్పదు.