Begin typing your search above and press return to search.

దేశాధ్యక్షుడి సోదరుడ్ని చంపటానికి ఇచ్చిందింతే..

By:  Tupaki Desk   |   26 Feb 2017 4:52 AM GMT
దేశాధ్యక్షుడి సోదరుడ్ని చంపటానికి ఇచ్చిందింతే..
X
సంచలనంగా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ ను అనూహ్య రీతిలో హతమార్చిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో విషాన్ని ముఖానికి పూయటం ద్వారా హత్య చేసిన వైనం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యకు సంబంధించిన కొత్త విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. దేశాధ్యక్షుడి సోదరుడ్ని చంపటానికి చేసిన ఖర్చు మరింత ఆశ్చర్యకరంగా ఉండటం గమనార్హం.

సరదాగా టీవీ షోల తరహాలో ఆట పట్టిస్తున్నట్లగా వ్యవహరించి చంపేసిన వైనంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఇండోనేషియాకు చెందిన సిటి ఐశ్యాహ్ కాగా.. మరొకరు వియత్నాంకు చెందిన మహిళగా చెబుతున్నారు. ఇండోనేషియాకు చెందిన ఐశ్యాహ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. కిమ్ జాంగ్ నామ్ ను హత్య చేయటానికి కేవలం ఆరువేల రూపాయిలు మాత్రమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

నామ్ పై చల్లిన వీఎక్స్ విషయం గురించి తనకు తెలీదని.. ఆట పట్టిస్తే రూ.6వేలు ఇస్తామని చెప్పారని.. టీవీ షోల్లో తరచూ చేసే ఆటపట్టించే కార్యక్రమంగా చెప్పటంతో తాను ఆ పని చేసినట్లుగా వెల్లడించారు. అయితే.. ఆమె చెబుతున్న మాటల్లో నిజం లేదన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. విషాన్ని చల్లే సమయంలో సదరు మహిళకు మరో నలుగురు యువకులు రక్షణగా నిలవటం.. హత్య జరిగిన వెంటనే వారు మలేసియా నుంచి పరారు కావటం సందేహాలకు తావిస్తోంది. ఒక దేశాధ్యక్షుడి సోదరుడ్ని ఆటపట్టిస్తున్న తీరులో చంపేసిన వైనంపై మలేషియా పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/