Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని ఆశ్చ‌ర్యప‌ర్చేలా కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   13 May 2018 4:09 PM GMT
ప్రపంచాన్ని ఆశ్చ‌ర్యప‌ర్చేలా కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న అంశానికి తెర‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇన్నాళ్లు క‌త్తులు దూసుకున్న రెండు దేశాల నాయ‌కులు శాంతి మంత్రం జ‌పిస్తుండ‌గా...మొండి ఘ‌టంగా పేరొందిన నాయ‌కుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో ప్ర‌పంచ పెద్ద‌ల‌తా ఊపిరి పీల్చుకునే ప‌రిణామం చోటుచేసుకోనుంది. అదే ఉత్త‌ర‌కొరియా అణ్వాస్త్రాల‌కు గుడ్‌బై చెప్పేయడం. ఔను....భారీ అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తర కొరియా తన న్యూక్లియర్‌ పరీక్షలను ఈ నెలలోనే నిలిపివేయాలని భావిస్తోంది. ఈ విష‌యాన్ని త‌మ ర‌థ‌సార‌థి కిమ్ వెల్ల‌డించిన‌ట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ చ‌ర్య‌ను అధికారికంగా చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని బాహ్య ప్ర‌పంచానికి వెల్ల‌డించారు.

ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని త‌న‌ దేశ ప్రజలకు కిమ్ ఇచ్చిన‌ సందేశంతో అమెరికా, కొరియాల మ‌ధ్య వార్ తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. అణుదాడికి సంబంధించిన బటన్ తన టేబుల్ మీద ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అమెరికాను హెచ్చరిస్తూనే.. నూతన ఏడాదిలో భారీగా అణ్వాయుధాలను, ఖండాంతర క్షిపణులను తయారు చేయాలని ఉత్తరకొరియా శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. అయితే కిమ్ బెదిరింపున‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీటుగా సమాధానమిచ్చారు. ఉత్త‌రకొరియా కంటే పెద్ద‌దైన అణుబాంబు త‌న వ‌ద్ద ఉంద‌ని తెలిపారు. `మీ కన్నా పెద్దది, చాలా శక్తివంతమైన బాంబు నా దగ్గర ఉంది.. ఆ స్విచ్ కూడా నా టేబుల్‌పైనే ఉంటుంది. అంతేకాదు.. అది ఫెయిలయ్యే చాన్సే లేదు` అని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో ఉద్రిక్తత‌లు మ‌ళ్లీ పెరిగాయి. అయితే వివిధ ప‌రిణామాల నేప‌థ్యంలో ఉభయ కొరియాల మధ్య చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయింది. గత ఏడు దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా మెలిగిన దాయాది దేశాలు శాంతి దిశగా ముందడుగు వేశాయి. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధరహితంగా మార్చేందుకు నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌, సౌత్‌ కొరియా అధ్యక్షుడు మూన్‌ ఇన్‌ల మధ్య అంగీకారం కుదిరింది. 65 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్యనున్న సైనిక విభజన రేఖ వద్ద కలుసుకున్న దేశాధినేతలు కరచాలనం చేసి ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు.

ఈ రెండు దేశాల మ‌ధ్య స‌ఖ్య‌త నెల‌కొన్న అనంత‌రం అమెరికా, ఉత్త‌ర‌కొరియాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కూడా స‌ద్దుమ‌ణిగాయి. సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేయాలని అమెరికా, దక్షిణకొరియా నిర్ణయించడంతో చర్చలకు ఉత్తరకొరియా అంగీకరించింది. దక్షిణకొరియాతో చర్చలకు ఉత్తరకొరియా అంగీకరించడంతో ట్రంప్ తన దూకుడును తగ్గించారు. దక్షిణకొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో పాల్గొంటామని కిమ్ ప్రకటించడంతో ట్రంప్ మెత్తబడ్డారు. అదే స‌మ‌యంలో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా అమెరిక‌న్ల విడుద‌ల సంద‌ర్భంగా ట్రంప్ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. తమ పౌరులను విడిచిపెట్టినందుకు కిమ్‌ను అభినందించిన ట్రంప్ తమ భేటీ వివరాలు చెప్పారు. ``కిమ్‌తో జరిగే నా భేటీలో అత్యధిక ఫలితాలు సాధించగలమని భావిస్తున్నా. దీన్ని ప్రపంచ శాంతి కోసం చాలా ప్రత్యేక సందర్భంగా మార్చేందుకు ప్రయత్నిస్తాం`` అని ట్వీట్ చేశారు.

దీనికి కొన‌సాగింపుగా...కిమ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అణ్వాయుధాలను త్యజిస్తామని పేర్కొంటూ మే 23-25 తేదీలలో ఈ పని చేయనున్నట్లు కిమ్ వెల్ల‌డించారు. రష్యా, - అమెరికా - చైనా - బ్రిటన్ దక్షిణ కొరియా మీడియా చూస్తుండగా అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు ఆయ‌న వెల్ల‌డించ‌డం ద్వారా సంచ‌ల‌న వార్త‌ను పంచుకున్నారు. కాగా, కిమ్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వాగతించడంతో పాటు ప్రశంసించారు.