Begin typing your search above and press return to search.

పీవీపీ కి దొంగ‌కంపెనీలున్నాయి..!

By:  Tupaki Desk   |   21 March 2019 8:15 AM GMT
పీవీపీ కి దొంగ‌కంపెనీలున్నాయి..!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీ స్థానానికి టికెట్ సంపాదించిన వ్యాపారవేత్త.. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పై.. ఆయన ప్రత్యర్థి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని నాని ధ్వజమెత్తారు. పీవీపీ గతంలో ప్రత్యేక హోదా బోరింగ్ టాపిక్ అంటూ ఓ సదస్సులో చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ నాని ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవీపీ అంతర్జాతీయ స్కామ్‌ స్టర్‌ అని.. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని నాని అన్నారు. ప్రస్తుతం పీవీపీ సుప్రీంకోర్టు బెయిల్‌ మీద ఉన్నారని నాని ధ్వజమెత్తారు. జగన్‌ డబ్బును హవాలా చేసింది పీవీపీనేనని ఆరోపించారు. నాదర్‌ గుల్‌ భూ కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి అన్నారు. పీవీపీ ఎలా మోసాలు చేశారో ప్యారడైజ్‌ పేపర్స్‌ వివరించిందని.. ఆయన చేసిన మోసాలు - అరాచకాలపై పుస్తకం వేయవచ్చని అన్నారు.

పీవీపీ అమెరికాలో దొంగ కంపెనీలు పెట్టి జనాల్ని మోసం చేశారన్న నాని.. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయనకు జనాల సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణారావు సైతం పీవీపీ మీద విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా గురించి పీవీపీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన రామకృష్ణారావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లయితే విజయవాడ పార్లమెంటు స్థానానికి పీవీపీ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐతే తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పీవీపీ స్పందించారు. తాను ఎప్పుడో వేరే సందర్భంలో అన్న వ్యాఖ్యల్ని ఇప్పుడు మిస్ కోట్ చేస్తున్నారని.. అప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన కాంటెక్స్ట్ వేరని ఆయన అన్నారు. ఏదేమైనప్పటికీ పీవీపీ ప్రత్యేక హోదా మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.