Begin typing your search above and press return to search.

వణికించేలా జాలీ నోట వాస్తవాలు

By:  Tupaki Desk   |   14 Oct 2019 6:33 AM GMT
వణికించేలా జాలీ నోట వాస్తవాలు
X
ఇప్పటి వరకూ సైకో నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ.. కేరళకు చెందిన సైకో సీరియల్ కిల్లర్ ఉదంతాన్ని చూసినప్పుడు.. రీల్ సైకో కథలేవీ రియల్ సైకో దరిదాపుల్లోకి కూడా రాలేవని చెప్పాలి. అత్తమామలు.. భర్త.. తాను చేసుకోవాలనుకున్న రెండో భర్త కుటుంబాన్ని.. ఇలా టార్గెట్ చేసిన వారిని కామ్ గా ఖతం చేసే సైకో కిల్లర్ జాలీ. చూసినంతనే ఆకర్షించే రూపం.. సౌమ్యంగా వ్యవహరించటం.. కలుపుగోలుగా ఉండటం.. కుటుంబ భారం మొత్తాన్ని తానే మోస్తున్నట్లుగా ఇమేజ్ తో పాటు.. ఇంట్లో వారు సైతం ఆమె ప్రొఫెసర్ అన్న భావనలో ఉండేలా చేయటం.. తాను అనుకున్న వారిని అనుకున్నట్లుగా చంపేయటం లాంటివి చూస్తే.. వణుకు పుట్టాల్సిందే.

జాలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసు విచారణ కోసం సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. ఇక.. ఆమెను విచారించేందుకు నియమితులైన సీనియర్ అధికారులు.. జాలీ నోటి నుంచి వస్తున్న వాస్తవాల్ని విని వణికిపోతున్న పరిస్థితి. మానవత్వం ఇసుమంతా లేకుండా ఇంత రాక్షసంగా చంపేసిన వివరాల్ని ఆమె ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు.

జాలీ కేసు ఒక సవాలుగా కేరళ పోలీస్ చీఫ్ సైతం స్పష్టం చేస్తున్నారు. పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరుగురిని చంపిన జాలీ.. మరికొందరిని చంపేందుకు వీలుగా ప్లానింగ్ చేసినట్లు గుర్తించారు. అన్నింటికి మించి.. ఇప్పుడున్న రెండో భర్తను కూడా చంపేసి.. మూడో పెళ్లి చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. జాలీ హత్యోదంతాల మీద పోలీస్ చీఫ్ లోక్ నాథ్ బెహ్రా కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. ఆమె కేసు చాలా కఠినమైనదని.. తమకో సవాలుగా ఆయన చెప్పారు.

విచారణలో భాగంగా జాలీకి సంబంధించిన కొత్త విషయాలు మరికొన్ని బయటకు వచ్చాయి.తన మేనమామ మాథ్యూను చంపటానికి ముందు రోజు అతడితో కలిసి జాలీ డ్రింక్ చేసింది. వారు కలిసి తాగిన తర్వాత.. మిగిలిన మద్యం సీసాలో సైనేడ్ కలిపి ఉంచటంతో.. తర్వాత రోజు ఇదేమీ తెలియన ఆయన దాన్ని తాగి మరణించారు.

భర్త మరణించిన రెండు రోజుల తర్వాత బీఎస్ఎన్ఎల్ లో పని చేసే తన స్నేహితుడు జాన్సన్ తో కలిసి కోయంబత్తూరు విహారయాత్రకు వెళ్లిన వైనాన్ని చెప్పటంతో పోలీసులు సైతం షాక్ తింటున్నారు. కోయంబత్తూరుకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇక తన రెండో భర్త షాజును పెళ్లాడిన ఆమె.. ఆ క్రమంలో అతడి భార్యను.. కుమార్తెను చంపేయటం తెలిసిందే.

కొద్ది కాలంగా తన రెండో భర్త షాజును చంపి.. జాన్సన్ అనే అతన్ని పెళ్లాడాలని ఆమె ప్లాన్ చేసిన వైనం బయటకు వచ్చింది. ఇందులో భాగంగా షాజును.. తాను మూడో పెళ్లి చేసుకోవాలనుకున్న జాన్సన్ భార్యను.. పిల్లల్ని చంపాలని కూడా ప్లాన్ చేసినా.. అవి విఫలమైన వైనం బయటకు వచ్చింది.

తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న విషయాన్ని.. పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా చెప్పినట్లు చెబుతున్నారు. తాను చేయాలనుకునే పనుల కోసం తాను లెక్చరర్ అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేదానినని.. ఇంట్లో వారిని తాను నమ్మించినట్లుగా ఆమె చెప్పటంతో.. ఆమె కర్కశత్వానికి పోలీసులు అధికారులు సైతం విస్తుపోతున్నారు.