Begin typing your search above and press return to search.

కలిసి పోరాటం సరే..మీటింగ్ పెట్టించు కవితక్క

By:  Tupaki Desk   |   31 Aug 2015 5:29 AM GMT
కలిసి పోరాటం సరే..మీటింగ్ పెట్టించు కవితక్క
X
రోటీన్ కి భిన్నంగా వ్యాఖ్యలు చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత అందుకు భిన్నంగా మాట్లాడారు. ఏపీ మీద విమర్శల మీద విమర్శలు చేసే ఆమె.. ఈసారి అందుకు భిన్నంగా కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్ష మీద పోరాటం చేయాలని.. ఇందుకోసం ఏపీతో కలిసి పని చేస్తామని చెప్పిన ఆమె.. ఏపీ హక్కుల కోసం ఆ రాష్ట్రంతో కలిసి పోరాటం చేసేందుకు తాము సిద్ధమేనని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు.

నిత్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడే కవితక్క ఈసారి అందుకు భిన్నంగా ఏపీ ప్రజల హక్కుల గురించి గళం విప్పటం కాస్తంత ఆశ్చర్యం కలిగించే అంశమే. విభజన తర్వాత.. పలు అంశాలకు సంబంధించి వాటాల మీద నిత్యం సాగుతున్న గొడవలు తెలిసిందే. వీటికి పరిష్కరం దొరక్క కేంద్రం వద్దకు కొన్ని.. కోర్టుల వద్దకు మరికొన్ని అంశాలు రెండు రాష్ట్రాలు తీసుకెళ్లటం తెలిసిందే.

నిజానికి.. పలు అంశాలకు సంబంధించి.. రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న లొల్లిని.. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా చాలావరకు పరిష్కరించుకునే వీలుంది. అయినప్పటికీ.. వీరిద్దరూ ఎదురెదురు పడటానికి.. కలసి కూర్చోవటానికి ఏ మాత్రం ఇష్టపటం లేదు. ఏపీ హక్కుల కోసం ఆ రాష్ట్రంతో కలిసి పోరాటం చేస్తామంటున్న కవిత.. పోరాటం దాకా ఎందుకు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీల్ని ఒక కొలిక్కి తెచ్చేలా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకచోటకు తీసుకొచ్చి మాట్లాడించి పుణ్యం కట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. తన తండ్రి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో.. చంద్రబాబు భేటీ గురించి మాట్లాడతారా..?