Begin typing your search above and press return to search.

గ‌డ్డంపై మ‌రో కౌంట‌ర్ వేసిన క‌విత‌

By:  Tupaki Desk   |   26 Oct 2016 7:13 AM GMT
గ‌డ్డంపై మ‌రో కౌంట‌ర్ వేసిన క‌విత‌
X
అవ‌కాశం వ‌స్తే చాలు..వెనుకా ముందు చూసుకోకుండా విమ‌ర్శ‌లు చేసేయ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. మిగిలిన‌వారి మాట ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ్యామిలీ మాత్రం ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో చాలా క‌ఠినంగా ఉంటుంది. తమ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా ఉండేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. విమ‌ర్శించే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌ని వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ తాను గ‌డ్డం తీయ‌న‌ని.. శ‌ప‌థం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై క‌విత త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

మొన్న‌టికి మొన్న ఉత్త‌మ్ గ‌డ్డం మీద ఘాటు వ్యాఖ్య‌లు చేసిన క‌విత‌.. తాజాగా మ‌రోసారి ఆయ‌న గ‌డ్డంపైనా త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఉత్త‌మ్‌ గ‌డ్డం ముచ్చ‌ట‌ను వృధా ప్ర‌యాస‌గా అభివ‌ర్ణించిన క‌విత‌.. తాజాగా ఆయ‌న గ‌డ్డంతో త‌మ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేద‌ని.. తాము చేసే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు అడ్డు ప‌డ‌కుండా ఉంటే చాల‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ గ‌డ్డం గీసుకోన‌న్న ఉత్త‌మ్ మాట‌ల్లో ప్ర‌జా సంక్షేమం కంటే కూడా.. అధికారం మీద యావ‌నే క‌నిపిస్తుందంటూ చిత్ర‌మైన లాజిక్ ను తెర మీద‌కు తీసుకొచ్చిన ఆమె.. ఉత్త‌మ్ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని అధికారంలో నుంచి దింపే వ‌ర‌కూ తాము అలా చేస్తాం.. ఇలా చేస్తామ‌ని చెప్ప‌టం రాజ‌కీయాల్లో మామూలే. కానీ.. అలాంటి మాట‌ల‌కు స‌రికొత్త భాష్యం చెబుతున్న క‌విత మాట‌లు చూస్తే.. విష‌యం ఏదైనా.. దాన్ని త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా చెప్పుకోవ‌టంలో ఎంపీ క‌వితకు ఉన్న టాలెంట్‌ ను అభినందించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/