Begin typing your search above and press return to search.

జ్యోతి మాటను ‘కవితక్క’ అవుననక తప్పలేదు

By:  Tupaki Desk   |   23 Nov 2015 4:06 AM GMT
జ్యోతి మాటను ‘కవితక్క’ అవుననక తప్పలేదు
X
కొన్న విషయాల్లో భేషజాలు ప్రదర్శించకూడదు. అలాంటివాటి వల్ల లేనిపోని సమస్యలే తప్పించి కించిత్ ప్రయోజనం ఉండదు. తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత.. ఆంధ్రజ్యోతి మధ్య గత కొద్ది రోజులుగా నడిచిన ‘ఎన్నికల ఖర్చు’ లెక్క ఒక కొలిక్కి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎంపీగా పోటీ చేసిన కవిత సమర్పించిన లెక్కకు సంబంధించి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందంటూ ఒక వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక అచ్చేసింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన లెక్కల్లో ఉన్న వ్యత్యాసాల్ని ప్రశ్నిస్తూ ఈసీ నోటీసులు ఇవ్వటం తప్పేం కాదు. అదేం ఒప్పుకోనంత పెద్ద తప్పేం కాదు. కొన్ని అంశాలకు సంబంధించి ఈసీ వివరణ అడగటం.. ఇందుకోసం నోటీసులు జారీ చేయటం.. దానికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పటంతో ఇష్యూ ముగిసిపోయే అవకాశం ఉంది.

అయితే.. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈసీ నోటీసును హైలెట్ చేస్తూ పెద్ద వార్తను అచ్చేసింది. సహజంగానే దూకుడు రాజకీయాలు అలవాటున్న టీఆర్ ఎస్ పార్టీకి.. జ్యోతి ప్రచురించిన వార్తను ఎక్కసం చేస్తూ ఎంపీ కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు నోటీసులు అందలేదని.. ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందే తప్పించి.. చర్యలు తీసుకోలేదు. అంటే.. తప్పు జరిగిందన్న మాటను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి వివరణ ఇవ్వాల్సిందిగా కోరటం మాత్రమే జరిగింది.

ఈసీకి ఏ విధంగా అయితే వివరణ ఇచ్చారో.. అలాంటి వివరణను ఇవ్వటం ద్వారా ఇష్యూను అక్కడికక్కడే క్లోజ్ చేసే అవకాశం కవితకు ఉంది. అయితే.. ఇక్కడే ఆమె తప్పు చేశారు. తన తప్పును ఎత్తి చూపిన ఆంధ్రజ్యోతిపై అగ్రహం వ్యక్తం చేస్తూ.. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో.. పక్కరోజు.. ఆమెకు నోటీసులు అందిన విషయాన్ని ఆధారాలతో జ్యోతి ప్రచురించారు. ఒకవేళ నోటీసుల విషయమై పే..ద్ద వార్త వేసిన తర్వాత కూల్ గా వివరణ ఇచ్చిన విషయాన్ని వెల్లడించి ఉంటే సరిపోయేదానికి.. నోటీసుల అంశం పక్కకు వెళ్లి.. నోటీసులు అందాయా? లేదా? అన్నది ప్రధానాంశంగా మారింది.

ఈసీకి సంబంధించిన అంశం కావటంతో.. తన మాటను వెనక్కి తీసుకోక తప్పలేదు. తాజాగా ఆమె.. ఈసీ నుంచి తనకు నోటీసులు అందాయని.. అయితే.. అది హైదరాబాద్ చిరునామాకు రాలేదని.. నోటీసుల విషయాన్ని నిజామాబాద్ లోని తన ఎన్నికల ఏజెంట్ దృష్టికి వెళ్లిందని.. నోటీసులు అందుకున్న రెండు రోజులకే సమాధానం ఇవ్వటం కూడా జరిగిందని వివరణ ఇస్తూ.. ఒక మీడియా ప్రకటనను జారీ చేశారు. నోటీసులు లాంటి విషయాలు అభ్యర్థుల దృష్టికి రావని.. అలాంటివన్నీ ఎన్నికల ఏజెంట్ చూసుకుంటారన్న సంబంధం లేని వివరణ ఇచ్చారు. నిజానికి ఆమె చెప్పిన విషయంలో వాస్తవం ఉండొచ్చు. కానీ.. ఈసీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దానికి బాధ్యత వహించాల్సింది ఏజెంట్ కాదు.. తానేనన్న విషయాన్ని కవిత విస్మరించినట్లు తన ప్రకటనలో పేర్కొన్న అంశాల్ని చూసినప్పుడు కనిపిస్తుంది.

కొన్ని సందర్భాల్లో వివరణ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసి ఊరుకుంటే మంచిది. ఏ మాత్రం వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు చేసినా.. దాని ద్వారా వచ్చే ఇబ్బంది ఎక్కువ. నోటీసులు వచ్చాయన్న విషయాన్ని ఓకే అనేస్తే.. ఈ రోజు విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ.. అందుకు భిన్నంగా నోటీసులు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఉంటాయేమో అన్న మాటకు.. ఆమె మళ్లీ వివరణ ఇస్తూ.. మీడియా ప్రకటన చేయాల్సి వచ్చింది. అందుకే.. అన్ని విషయాల్లోనూ దూకుడు ప్రదర్శించటం అంత మంచిది కాదన్న విషయాన్ని కవితక్క గుర్తిస్తే మంచిది.