Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రే పారిపోయిన‌ బాబు..మ‌మ్మ‌ల్ని అనే హ‌క్కుందా?

By:  Tupaki Desk   |   22 March 2018 1:28 PM GMT
రాత్రికి రాత్రే పారిపోయిన‌ బాబు..మ‌మ్మ‌ల్ని అనే హ‌క్కుందా?
X
ఒక్క సినీ పరిశ్రమ తప్ప అన్ని వర్గాలు కేంద్రం చేస్తున్న అన్యాయంపై నోరు విప్పారని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నాయ‌కురాలు - సినీన‌టి క‌విత మండిప‌డ్డారు. ఏసీ రూముల్లో కులుకుతున్నారని రాజేంద్రప్రసాద్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ మాటలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సినిమా పరిశ్రమ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కానీ టీడీపీ నేత‌లే రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారం పరిమిత కాలమని, సినీ పరిశ్రమ మాత్రం శాశ్వతం అని కవిత తేల్చిచెప్పారు.

తెలుగుదేశం పార్టీ అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే ఉద్దేశ్యంతోనే యూటర్న్ తీసుకున్నారని కవిత విమర్శించారు. వారి నాటకాలకు సినిమా పరిశ్రమ త‌ల ఊప‌లేద‌ని విమ‌ర్శించ‌డం ఏంట‌ని అన్నారు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమ ముందుంటుందని క‌విత తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సినీ పరిశ్రమను నెత్తిమీద పెట్టుకొని గౌరవిస్తుంటే ఆయనిచ్చే గౌరవంలో టీడీపీ కొంచెం కూడా ఇవ్వడం లేదని మండిప‌డ్డారు. తమ్మారెడ్డి భరద్వాజ దీక్ష చేస్తే ఆయనను, ఆయన చుట్టు ఉన్న వారిని కొట్టి, అరెస్టు చేశారని, దీనిని ఏమంటారని క‌విత ప్ర‌శ్నించారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారని, అందుకే దీక్ష విఫలం చేశారని ఆమె ఆరోపించారు.

అస‌లు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టిందే టీడీపీ అని క‌విత విరుచుకుప‌డ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయప‌డి చంద్రబాబు రాత్రికి రాత్రే అమరావతి వెళ్లిపోయారని కవిత ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీకి త‌మ గురించి మాట్లాడే హక్కు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు.