Begin typing your search above and press return to search.

క‌థువా:మేం రేప్ చేయ‌లేదు..నార్కో టెస్ట్‌ కు రెడీ!

By:  Tupaki Desk   |   16 April 2018 11:48 AM GMT
క‌థువా:మేం రేప్ చేయ‌లేదు..నార్కో టెస్ట్‌ కు రెడీ!
X
జమ్మూకశ్మీర్‌ లోని కతువా రేప్ కేసు ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఈ రేప్, హత్య కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఆ పాపను కిడ్నాప్ చేసి ఓ గుడిలో బంధించి కొన్ని రోజుల పాటు అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కథువా గ్యాంగ్‌ రేప్‌ లో మాజీ రెవెన్యూ అధికారి సాంజీరామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘ‌ట‌న మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది ఇవాళ జిల్లా కోర్టు ముందు హాజరయ్యారు. ఆ అత్యాచారంతో తమకు సంబంధం లేదని - తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని నిందితులు జడ్జిను కోరారు. అయితే ఈ కేసులో తీర్పును ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. అయితే ఈకేసులో చార్జ్‌షీట్ కాపీలను తన ముందు పెట్టాలని జడ్జి ఆ రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులను కోరారు. మరోవైపు నిందితులందరూ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. స్థానిక తెగలకు చెందిన కొందరు ఓ 8 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి రేప్ చేసినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో రాశారు. జైలులో ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత మళ్లీ నిందితులను పూర్తి భద్రత మధ్య కారాగారానికి తరలించారు. త‌న‌కు నార్కో ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన నిందితుడు సాంజీ రామ్ డిమాండ్ చేశారు. చిన్నారి అత్యాచారం, హ‌త్య వెనుక కుట్ర ఉన్న‌ద‌ని, త‌న తండ్రికి ఆ ఘ‌ట‌న‌తో సంబంధం లేద‌ని, ఈ కేసును సీబీఐ విచారించాల‌ని సాంజీ రామ్ కూతురు డిమాండ్ చేసింది.

మ‌రోవైపు బాలిక కుటుంబం తరఫున వాదిస్తున్న లాయర్ దీపికా రాజావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కూడా రేప్ చేసి, హత్య చేస్తారేమోనని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. తనకు తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరనున్నట్లు దీపికా చెప్పారు. నేను ఎన్ని రోజులు బతికుంటానో నాకు తెలియదు. నన్ను కూడా రేప్ చేసి చంపేయొచ్చు. నాపై దాడి జరగొచ్చు. నిన్ను ఎప్పటికీ క్షమించం అంటూ నాకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను ప్రమాదంలో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు చెబుతా అని దీపికా అన్నారు. తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉండటంతో కేసు విచారణను చండీగఢ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ పాప తండ్రి ఇవాళ సుప్రీంకోర్టును కోరారు. కథువాలో విచారణకు అనుకూల వాతావరణం లేదు అని దీపికా చెప్పారు.