Begin typing your search above and press return to search.

బాధ‌లో ఉన్న ప‌వ‌న్ ను కెలికిన క‌త్తి

By:  Tupaki Desk   |   20 April 2018 10:29 AM GMT
బాధ‌లో ఉన్న ప‌వ‌న్ ను కెలికిన క‌త్తి
X
ప‌వ‌న్ ఓ సినీ న‌టుడు. జ‌న‌సేనాధినేత‌. మ‌రి.. క‌త్తి మ‌హేశ్‌.. ఒక సినీ విమ‌ర్శ‌కుడని చెప్పుకుంటారు. ఈ విష‌యాల్ని ప‌క్క‌న పెడితే ఇండ‌స్ట్రీలో ఇంత‌మంది సినీ ప్ర‌ముఖులు ఉన్నా క‌త్తి మ‌హేశ్ గురి మొత్తం ఎప్పుడూ ప‌వ‌న్ మీద మాత్ర‌మే ఉంటుంది.

ఆయ‌న‌పై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తారు. ప్ర‌తి విష‌యాన్ని గిల్లిన‌ట్లుగా మాట్లాడ‌తారు. మ‌రి.. ఇదే మ‌హేశ్ ఇంకెవ‌రిపైనైనా ఇదే స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తారా? అంటే డౌటే. సోష‌ల్ మీడియాలో త‌న అభిప్రాయాల్ని భావ‌స్వేచ్ఛ పేరుతో చెప్పే క‌త్తి మ‌హేశ్‌.. దానికి బ‌దులుగా ఎవ‌రైనా ఆయ‌న్ను త‌ప్పు ప‌డితే చాలు ఫైర్ అవుతారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిట్టేస్తున్నారంటూ మండిప‌డ‌తారు.

ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ ను ఉద్దేశించి మ‌రింత విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేస్తారు. ఇదంతా చూసిన‌ప్పుడు క‌త్తి మ‌హేశ్ అనే వ్య‌క్తి అదే ప‌నిగా ప‌వ‌న్ పైన విమ‌ర్శ‌లు చేయ‌ట‌మే మొత్తం ర‌చ్చ‌కు కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ మాట అంటే.. త‌న భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకునే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని చెబుతాడు క‌త్తి. నిజ‌మే.. ఎవ‌రి భావ‌స్వేచ్ఛ‌ను మ‌రెవ‌రూ నియంత్రించ‌లేరు. కానీ.. భావ‌స్వేచ్ఛ పేరుతో అదే ప‌నిగా విమ‌ర్శించ‌టం కూడా స‌రికాదు క‌దా. ఒక ఫిలిం క్రిటిక్ గా.. మేధావిగా.. విచ‌క్ష‌ణ‌లు తెలిసిన వ్య‌క్తిగా ఉన్న క‌త్తి మ‌హేశే.. సాదాసీదా ఫ్యాన్స్ చేసే విమ‌ర్శ‌ల్ని.. వారి శాప‌నార్థాల్ని భ‌రించ‌లేని ప‌రిస్థితి. అలాంట‌ప్పుడు తాము దైవంగా పూజించే.. ఆరాధించే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి అదే ప‌నిగా విమ‌ర్శించ‌టాన్ని ఆయ‌న ఫ్యాన్స్ ఎందుకు స‌హిస్తారు?

క‌త్తి మేధావి కాబ‌ట్టి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ క‌త్తి మాదిరి టిపిక‌ల్ గా మాట్లాడంలో అనుభ‌వం లేక‌పోవ‌చ్చు. త‌మ మ‌న‌సులోని భావాల్ని త‌మ‌కు తోచిన‌ట్లుగా చెప్పుకోవ‌టం మాత్ర‌మే వారికి రావొచ్చు. అంత మాత్రానికే వారిని త‌ప్పు ప‌ట్టేయ‌టం ఎందుకు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక ప్ర‌ముఖుడ్ని ఒక వ్య‌క్తి అదే ప‌నిగా విమ‌ర్శిస్తుంటే.. దానిపై డిబేట్ల మీద డిబేట్లు పెట్ట‌టం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అన్న‌ది ప్ర‌శ్న‌. క‌త్తి విమ‌ర్శ‌కుడైన‌ప్పుడు.. ప‌వ‌న్ ను చీల్చి చెండాడిన‌ట్లుగా.. బాల‌కృష్ణ‌ను కానీ ఇంకెవ‌రైనా సినీ ప్ర‌ముఖుడ్ని ఎందుకు విమ‌ర్శ‌లు చేయ‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా క‌త్తి మ‌హేశ్ పెడుతున్న మేసేజ్ లపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న త‌ల్లిని దారుణంగా అవ‌మానిస్తూ అన్న మాట‌పై త‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. త‌న‌పై జ‌రుగుతున్న కుట్ర గురించి వివ‌రాలు వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించిన ప‌వ‌న్.. ఫిలిం ఛాంబ‌ర్లో త‌న లాయ‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. సినీ పెద్ద‌ల్ని చాంబ‌ర్ కు రావాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇలాంటి వేళ‌.. క‌త్తి త‌న ట్వీట్ల‌కు ప‌దును పెట్టారు. రెండు ట్వీట్లు పెట్టిన మ‌హేశ్ క‌త్తి.. తాను ఇప్పుడే ప‌వ‌న్ పోస్టుల్ని చూశాన‌ని.. ఒక బూతు మాట అనిపిస్తే త‌గ్గేస్థాయి.. దాని కోసం ఒక పెద్ద రాజ‌కీయ కుట్ర‌.. మీడియా ప్ర‌ణాళిక‌.. ఈ ఘ‌ట‌న‌ను సింప‌తీ కోసం మ‌రీ సాగ‌దీస్తే ప‌లుచ‌న అయ్యేది ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్ర‌మే అని ట్వీట్ చేయ‌టం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారూ వెళ్లి పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టండి స‌ర్ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ ఎందుకు అంటూ పోస్ట్ చేసిన వైనం ఇప్పుడు ప‌లువురు త‌ప్పు ప‌ట్టేలా చేస్తోంది. శ్రీ‌రెడ్డి ఉదంతంలో పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లి కేసు పెట్టండని స‌ల‌హా ఇచ్చిన విష‌యాన్ని త‌న‌దైన శైలిలో గుచ్చుతున్న‌ట్లుగా వ్యంగ్యంగా మ‌హేశ్ క‌త్తి వ్యాఖ్య‌లు చేయ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌న గురించి ప‌వ‌న్ అభిమానులు తిట్టారంటూ తెగ ఫీల‌య్యే క‌త్తి.. న‌డి రోడ్డు మీద ప‌వ‌న్ తల్లిని దారుణంగా తిట్ట‌టంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ గా కాక‌.. ఒక కొడుకుగా కూడా స్పందించ‌కూడ‌దా?