Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఓ అరాచ‌క శ‌క్తి: క‌త్తి మ‌హేష్

By:  Tupaki Desk   |   23 April 2018 12:13 PM GMT
ప‌వ‌న్ ఓ అరాచ‌క శ‌క్తి: క‌త్తి మ‌హేష్
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ను దూషించిన త‌ర్వాత శ్రీ‌రెడ్డి, వ‌ర్మ‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌ర్వాత కూడా ప‌వ‌న్ ఈ విష‌యం పై గొడ‌వ చేయడం స‌రికాద‌ని మ‌హేష్ అభిప్రాయ‌ప‌డిన విష‌యం విదిత‌మే. తాజాగా, ప‌వ‌న్ పై మ‌హేష్ మ‌రో షాకింగ్ పోస్ట్ పెట్టారు. గ‌తంలో త‌న‌పై కోడిగుడ్ల దాడి చేసిన ఇద్ద‌రు యువ‌కుల‌తో ప‌వ‌న్ దిగిన ఫొటోల‌ను త‌న ఫేస్ బుక్ ఖాతాలో మ‌హేష్ పోస్ట్ చేశారు. త‌న‌పై దాడి చేసిన ఆ ఇద్ద‌రు ఫ్యాన్స్ తో ప‌వ‌న్ ఫొటోదిగ‌డంపై మ‌హేష్ మండిప‌డ్డారు. త‌న‌ మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ ....త‌న‌పై దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం అంటూ మ‌హేష్ ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ అభిమానుల‌కు - మ‌హేష్ కు మ‌ధ్య వెర్బ‌ల్ వార్ జ‌ర‌గుతున్న సంద‌ర్భంలో మ‌హేష్ పై కోడిగుడ్ల‌తో దాడి చేసి....ఓ న్యూస్ చానెల్ స్టూడియోలో ఆ ఇద్ద‌రు యువ‌కులు లైవ్ డిబేట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ డిబేట్ లో క‌త్తి మ‌హేష్ కూడా పాల్గొని ....వారిపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకొని....ఆ త‌ర్వాత ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. అయితే, తాజాగా ప‌వ‌న్ పై మ‌రోసారి విరుచుకుప‌డుతున్న మ‌హేష్ ...త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ ...త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు య‌థాత‌థంగా......

పవన్ కళ్యాణ్ : రాజకీయాలలో ఒక అరాచక శక్తి

‘‘ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. నా మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కల్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం? మొన్నటికి మొన్న ఫిల్మ్ ఛాంబర్‌ కి అభిమానుల్ని పిలవడం వెనక దాగున్న మతలబు - అమ్మ సెంటిమెంటుని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలని సాధించడం కాదా!

అభిమానుల కోసం పవన్ అక్కడికి రాలేదు. తన అక్కసు వెళ్లగక్కడానికి. మా అసోషియేషన్‌ ను టెర్రరైజ్ చేసి.. మీడియా మీద వార్ ప్రకటించడానికి వచ్చాడు. అభిమానుల ఆవేశాన్ని తన ఆయుధంగా మలుచుకోవడానికి ప్లాన్ వేసుకునే వచ్చాడు. అక్కడ జరిగింది అదే. ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి. దాడి చేసిన అభిమానుల్ని అరెస్టు చేస్తే, వాళ్ళని విడిపించడం మానుకుని, అది కూడా మీడియా ఆరాచకమే అని కలర్ ఇస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాలలో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలని చేయిస్తున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోలో 24 క్రాఫ్ట్స్ మీటింగ్ అని పిలిచి. అభిమానులు అక్కడా హంగామా చేసేలా చేసి, పవన్ మాత్రం రాకుండా, మీడియాని, అభిమానుల్ని తప్పుదోవ పట్టించాడు. దీని వెనక ఒక హింసాత్మక కుట్ర పునాది దాగుందని నాకు అనిపిస్తే అది నా తప్పే అవుతుంది. కానీ ఈ ఫోటో చూసాక, అది అసాధ్యం కాని కుట్ర అనిపించి రాస్తున్నాను.

రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ కోసం చస్తాం. చంపుతాం అనే యువత ఎంతలేదన్నా ఒక 10 నుంచీ 20 వేల మంది ఉంటారు. పవన్‌కి వ్యతిరేకం అనుకుంటున్న మీడియా మీద.. పవన్ కల్యాణ్‌కి ఇష్టం లేని మనుషుల్ని అటాక్ చెయ్యడానికి - రాష్ట్ర వ్యాప్తంగా - ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడి సృష్టించడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న కుట్ర ఇది. మీడియా ప్రముఖుల పేర్లు, ఫోటోలు బయటపెట్టి బెదిరించడం వెనక. నాలాంటి వాళ్ళ ఇంటి అడ్రస్సులు వాళ్ల చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉంది.

త్వరలోనే పవన్ కల్యాణ్... అభిమానుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టించబోతున్నారు. పవన్‌ను పిచ్చిగా అభిమానించే కాపు-దళిత యువకులు ఈ కుట్రలో సమిధలు అవుతారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కల్యాణ్ కింగ్ అవొచ్చు. లేదా కింగ్ మేకర్ అవొచ్చు’’ అని కత్తి మహేష్ త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ త‌ర‌ఫు నుంచి ఎటువంటి స్పంద‌న రాలేదు.