Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నిబంధన ఈ తల్లీ కొడుకులకు శాపమైంది..

By:  Tupaki Desk   |   20 Nov 2018 9:00 AM GMT
కాంగ్రెస్ నిబంధన ఈ తల్లీ కొడుకులకు శాపమైంది..
X
కాంగ్రెస్ లో తల్లీ కొడుకుల సెంటిమెంట్ కు కాంగ్రెస్ శ్రేణులను బాధకు గురిచేస్తోంది. 2014లో కొడుకు ఎంపీ కావడం కోసం తల్లి పోటీ నుంచి విరమించుకుంటే.. నేడు తల్లి ఎమ్మెల్యే కావడం కోసం కొడుకు పోటీకి దూరమయ్యారు. కాంగ్రెస్ ఒక కుటుంబానికి ఒక్కటే సీటు అన్న ఫార్ములాలో ఒకటే సీటు దక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది..

సబితా ఇంద్రారెడ్డి .. వైఎస్ హయాంలో హోంమంత్రిగా పనిచేశారు. సీనియర్ రాజకీయ నాయకురాలు. కానీ 2014లో కొడుకు కార్తీక్ రెడ్డి రాజకీయ అరంగ్రేట్రం కోసం మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయకుండా కొడుక్కు చేవెళ్ల ఎంపీ టికెట్ ను ఇప్పించారు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఫార్ములాతో ఆమె 2014లో పోటీకి దూరంగా జరిగారు. కానీ 2014 ఎన్నికల్లో చేవెళ్లలో కార్తీక్ రెడ్డి ఓడిపోయారు.

ప్రస్తుతం కూడా అదే కాంగ్రెస్ నిబంధన ఈ తల్లీ కొడుకులకు అడ్డు వచ్చింది. ఈసారి మహేశ్వరం నుంచి సబితా, రాజేంద్రనగర్ నుంచి కార్తీక్ రెడ్డి పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇద్దరూ బలమైన నేతలే కావడం.. ఆ రెండు స్థానాల్లో పెద్దగా పోటీలేకపోవడంతో రెండు టికెట్లు ఆశించారు. కానీ మహాకూటమి పొత్తుల ఎత్తుల్లో కార్తీక్ రెడ్డికి సీటు దక్కలేదు. సీట్ల సర్దుబాటులో రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీ ఎగరేసుకుపోయింది. దీంతో నిరాశ చెందిన కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి రెబల్ గా పోటీచేస్తానని ప్రకటించారు. కానీ ఇంతలోనే అమ్మ సబితా రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని భావించి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తల్లి కోసం సీటును త్యాగం చేసిన కొడుకుగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయాడు.

నిజానికి ఒక ఫ్యామిలీకి ఒక సీటు అన్న నిబంధన అమలు విషయంలో పక్షపాతంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఫ్యామిలీ నుంచి ఆయనకు , ఆయన భార్యకు , వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి, ఆయన సోదరుడుకు టికెట్టుకు ఇచ్చి సబితా ఫ్యామిలీకి ఎందుకు ఇయ్యరు అని వారు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ కొందరి విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.