Begin typing your search above and press return to search.

మ‌హిళా మంత్రి చెవులు కోస్తామంటున్న క‌ర్ణిసేన‌

By:  Tupaki Desk   |   14 Jun 2018 3:33 PM GMT
మ‌హిళా మంత్రి చెవులు కోస్తామంటున్న క‌ర్ణిసేన‌
X
ప‌ద్మావ‌తి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన క‌ర్ణిసేన తాజాగా మ‌రో సంచ‌ల‌న సృష్టించింది. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరిపై శ్రీరాజ్‌ పుత్ కర్ణిసేన సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. కర్ణిసేన వర్గ ప్రజలకు మంత్రి క్షమాపణలు చెప్పకపోతే ఆమె చెవులు - ముక్కు కోసేస్తామని హెచ్చరించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...క‌ర్ణిసేన నాయ‌కుల‌ను మంత్రి మహేశ్వరి ఎలుక‌లతో పోల్చారు. దీనిపై మండిపడుతూ వారు ఈ హెచ్చ‌రిక చేశారు.

ఇటీవ‌ల మంత్రి మహేశ్వరి ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ ```ఇక్కడ కొంతమంది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల నుంచి ఎలుకల్లా బయటకు వస్తున్నారు` అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సంఘర్ష్ సమితి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే కర్ణిసేన వర్గానికి మంత్రి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. త్వరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సర్వ్ రాజ్‌ పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి సభ్యులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. గ‌త‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌ పుత్ ప్రజల ఓట్ల సహాయంతోనే మహేశ్వరి గెలిచారు. ఈ మంత్రి నియోజకవర్గంలోనే 40 వేల మంది రాజ్‌ పుత్‌ లు ఉన్నారు. రాజ్‌ పుత్ కమ్యూనిటీ సహాయంతోనే బీజేపీ రాజస్థాన్‌లో కొంత బలంగా ఉంది.

కాగా, కర్ణిసేన చేస్తున్న డిమాండ్‌ పై మంత్రి మహేశ్వరి స్పందించారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని మంత్రి వివరణ ఇచ్చారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ స్పందిస్తూ.. మహేశ్వరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.