Begin typing your search above and press return to search.

రోడ్డు మీద పడుకుంటా: కుమారస్వామి

By:  Tupaki Desk   |   22 Jun 2019 11:05 AM GMT
రోడ్డు మీద పడుకుంటా: కుమారస్వామి
X
ఎన్నికలన్నీ ముగిసిపోవడంతో కర్ణాటక సీఎం కుమార స్వామి ఇప్పుడు ‘పల్లెనిద్ర’కు ఉపక్రమించారు. ఆయన గ్రామాల పర్యటన పెట్టుకోవడంతో అధికారులు లగ్జరీ ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టారు. తాజాగా యాద్గిర్ లో పల్లెనిద్ర చేసిన కుమారస్వామి బస చేయబోయే లాడ్జీలోని బాత్రూమ్ ను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అయితే కుమారస్వామి సాధారణ నిద్ర చేయడం లేదని.. ఖరీదైన నిద్రలు చేస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాడని ప్రతిపక్ష బీజేపీ నేతలు విమర్శలు గుప్పించాయి.

దీనిపై కన్నడ సీఎం కుమారస్వామి ఘాటుగా స్పందించారు. ఒక్క చిన్న బాత్రూం నిర్మిస్తే రాద్ధాంతం చేస్తారా అని విమర్శించారు. రోజంతా ప్రభుత్వ కార్యక్రమాల్లో అలసిన తనకు స్వాంతన కోసమే బాత్రూం ఏర్పాటు చేశారని.. అదీ తప్పేనా అని బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు..

ఇక తాను తన తండ్రి దేవె గౌడ ప్రధానిగా ఉండగా.. ఆయనతోపాటు రష్యాలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ లో బస చేశానని.. ఇప్పుడు పల్లెనిద్రలో నేల మీద పడుకుంటున్నానని.. అవసరమైతే రోడ్డు మీద కూడా పడుకుంటానని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తిగా తనకు ఇవి మామూలేనని.. బీజేపీని చూసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని కౌంటర్ ఇచ్చారు.

తన పల్లెనిద్రకు సాధారణ బస్సులోనే వస్తున్నానని.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని.. రాజకీయ విమర్శలు మానుకోవాలని కుమారస్వామి ప్రతిపక్షాలను కోరారు.