Begin typing your search above and press return to search.

సీఎం గారి పల్లె నిద్ర ఖర్చు..అక్షరాల రూ.కోటి!

By:  Tupaki Desk   |   24 Jun 2019 7:32 AM GMT
సీఎం గారి పల్లె నిద్ర ఖర్చు..అక్షరాల రూ.కోటి!
X
పల్లె నిద్రతో ప్రజలను ఉద్ధరించడం మాటేమిటో కానీ ఖజానాకు మాత్రం భారీగా బొక్క పెడుతున్నారట కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ముఖ్యమంత్రిగా తను ఎన్ని రోజులు ఉంటానో తనకే తెలియదని తరచూ ప్రకటిస్తూ ఉంటారాయన. అయితే ప్రజలను ఆకట్టుకోవడానికి పల్లెనిద్ర వంటి కార్యక్రమాలను ఆయన చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ఎంత ఆర్భాటంగా - ఎంత భారీ ఖర్చుతో జరుగుతోందో తెలిసే ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.

దాని ప్రకారం ఇటీవల కుమారస్వామి ఒక పల్లెకు వెళ్లి ఒక రాత్రి నిద్ర చేయగా దానికి అయిన ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు అని తెలుస్తోంది. ఒక రాత్రి దేశంలోని ఏ పెద్ద స్టార్ హోటల్లో బస చేసినా - ఎంత భారీగా తిని తొంగున్నా అయ్యే ఖర్చు లక్షల్లో ఉండవచ్చు. అలాంటిది ఒక పల్లెలో నిద్ర చేస్తే సీఎం ఖర్చు కోటి రూపాయలు ఎలా అయ్యిందనేది బయటి వాళ్లకు ఒక మిస్టరీ.

అక్కడకూ సీఎంగారు ఆ రాత్రి నిద్రపోయినది ఒక ప్రభుత్వ పాఠశాలలోనేనట. అయితే తన మందీ - మార్బలాన్ని తీసుకెళ్లడం - ఆ కార్యక్రమం ద్వారా ప్రచారం కోసం ప్రజలను భారీ ఎత్తున తరలించడం - వచ్చిన వాళ్లకు టిఫెన్లు - భోజన ఏర్పాట్లు.. ఇవన్నీ కూడితే ఏకంగా కోటి రూపాయల లెక్క తేలిందట.

అలా ఒక్క రాత్రి పల్లెలో బస చేసినందుకు రికార్డు స్థాయి మొత్తం ఖర్చు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి. అదంతా ప్రజాధనమే. నేతలు తామేం చేస్తున్నారో కొంచెమైన ఆలోచించుకుంటే బావుంటుందని పరిశీలకులు అంటున్నారు.