Begin typing your search above and press return to search.

ఆ సీన్ చూసి..బాబు దిమ్మ‌తిరిగేపోయింది!

By:  Tupaki Desk   |   27 July 2017 5:29 AM GMT
ఆ సీన్ చూసి..బాబు దిమ్మ‌తిరిగేపోయింది!
X
జంప్ జిలానీల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటుగా వారికి మంత్రి ప‌ద‌వులు - కార్పొరేష‌న్ చైర్మ‌న్లు - నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి అధికారాలు క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా పెద్ద‌పీట వేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై సొంత పార్టీ నేత‌ల ఆగ్ర‌హం తారాస్థాయికి చేరుతోంది. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. కొద్దికాలంగా సద్దుమ‌ణిగిన ఇలాంటి వివాదాలు మ‌ళ్లీ తెర‌కెక్కుతున్నాయి. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయ ప్ర‌త్యర్థులుగా ఉన్న ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ - ఎమ్మెల్సీ కరణం బలరాం మ‌ధ్య వాదోప‌వాదాలు ఒకే పార్టీ నేత‌లుగా మారిన‌ప్ప‌టికీ స‌మ‌సిపోలేదు. స‌రికదా సంద‌ర్భానుసారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా కనిగిరిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ కరణం బలరాం మ‌రోమారు గొట్టిపాటి ర‌విపై విరుచుకుప‌డ్డారు. ఏకంగా ఇద్ద‌రు మంత్రుల స‌మ‌క్షంలోనే పార్టీ అధినేత చంద్ర‌బాబు తీరును పరోక్షంగా తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

మంత్రులు పరిటాల సునీత - శిద్దాల రాఘవరావుల స‌మ‌క్షంలో జ‌రిగిన `స‌మ‌న్వ‌య క‌మిటీ`లో మాట్లాడుతూ టీడీపీ సీనియ‌ర్ నేత‌ క‌ర‌ణం బ‌ల‌రాం త‌న అస‌హ‌నాన్ని - ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. ``ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే పార్టీలో ఏం జ‌రుగుతోందో మాకు అర్థం కావ‌డం లేదు. 30 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పోరాటం చేస్తున్న వాళ్ల‌కంటే....అవ‌స‌రాల కోసం వ‌చ్చి పబ్బం గ‌డుపుకొని పోయే నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏమైనా అంటే ప్రొటోకాల్‌ అంటూ పార్టీ మమ్మల్ని కట్టడి చేస్తోంది. క్షేత్ర‌స్థాయిలో ప‌డే ఇబ్బందులు మాకు తెలుసు. మేం మంజూరు చేయించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నారు. మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు. తన వైపు రావాలంటూ అల్టిమేటం జారీ చేస్తున్నాడు. పార్టీ కోసం పని చేసిన వారి రేషన్‌ షాపులను సైతం బలవంతంగా తొలగిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి 30 ఏళ్లుగా తెలుగుదేశం జెండాలు మోసిన వారిని కాదని అభివృద్ధి పనులు సైతం పార్టీకి ఓట్లేయని వారికే కట్టబెడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా పాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. ఇక చూస్తూ ఊరుకునేది లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దారి మేం చూసుకుంటాం`` అని క‌ర‌ణం బ‌ల‌రాం కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో అవాక్క‌వ‌డం మంత్రుల వంతు అయింది.

ఇంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా పాత కార్యక‌ర్త‌ల‌కు అన్యాయం చేస్తున్నారు, పార్టీకి ఓటేసిన పాపానికి అనేక మంది న‌ష్ట‌పోతున్న తీరుకు స్టేజ్‌మీదున్న వారు స‌మాధానం చెప్పాలి అని క‌ర‌ణం బ‌ల‌రాం తేల్చిచెప్ప‌డంతో మంత్రులు ఇద్ద‌రు ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలని లేని ప‌క్షంలో ఏదైనా తేల్చుకునేందుకు తాము సిద్ధ‌మ‌ని మాజీ మంత్రి క‌ర‌ణం తేల్చిచెప్పారు. ఇదే స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు సైతం తాము ఎదుర్కుంటున్న ప‌రిస్థితుల‌ను స‌భా ముఖంగా ఏక‌రువు పెట్టారు. క‌ర‌ణం నిప్పులు చెరుగుతున్న తీరును చూసి ఎమ్మెల్సీ మాగుంట త‌న‌కు వేరే ప‌ని ఉంద‌ని చెప్తూ స్టేజీ దిగివెళ్లిపోయారు. దీంతో ప‌రిస్థితి చేయిదాటిపోతున్న‌ట్లు మంత్రులు ప‌రిటాల‌, శిద్దా రాఘ‌వ‌రావు గ‌మ‌నించారు. అనంత‌రం వారు స్పందిస్తూ స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని తెలిపారు. ఆగ‌స్టు ఒక‌టో తేదీన పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో స‌మావేశం ఏర్పాటుచేసిన స‌మావేశంలో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రం అవుతాయ‌ని ఊర‌ట క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు. కాగా, ఈ స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్యే క‌దిరి బాబురావు నివాసంలో జ‌రిగిన స‌మావేశానికి జంపింగ్ ఎమ్మెల్యేలు హాజ‌రుకాలేదు