Begin typing your search above and press return to search.

వాట్ ఏ సెటైర్ః 'ఓన్లీ భాషణ్ - నో శాసన్'

By:  Tupaki Desk   |   27 May 2016 7:17 AM GMT
వాట్ ఏ సెటైర్ః ఓన్లీ భాషణ్ - నో శాసన్
X
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ రెండేళ్ల‌ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. విమ‌ర్శ‌ల రూపంలో కాకుండా కేవ‌లం రెండే రెండు వ్యాఖ్య‌ల్లో ఆ పార్టీ మోడీ పాల‌న గురించి తేల్చేసింది. ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్ - మల్లికార్జున ఖర్గే - కపిల్ సిబల్ మీడియాతో మాట్లాడుతూ గడచిన రెండేళ్లలో మోడీ ఏం చేశార‌ని చెప్పాలంటే 'ఓన్లీ భాషణ్-నో శాసన్' (మాటలు మాత్రమే - చేతలు లేవు) అని సెటైర్ వేశారు.

దేశంలో మార్పును తీసుకువస్తా మని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మోడీ గత రెండేళ్లలో ఏ మార్పూ తేలేకపోయారని కాంగ్రెస్ నేత‌లు నిప్పులు చెరిగారు. 'గత రెండేళ్ల పాలన అద్భుతం అంటూ మోడీ, ఆయ‌న టీం సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకోవడానికి ఏముంది? ఉద్యోగాల సృష్టి జరిగిందా? రైతులకు లాభం 50 శాతం పెరిగిందా? దేశంలో ఎక్కడైనా రక్షణ ఉందా' అంటూ కపిల్ సిబల్ ప్రశ్నల వర్షం కురిపించారు. 'కిస్ కా సాథ్?, కహా హై వికాస్? (వికాసం ఎక్కడ? ఎవరికి దగ్గరైంది?)' అని ఆయ‌న దుయ్యబట్టారు. ప్రతి 45 గంటలకూ ఓసారి కబుర్లు చెప్పే మోడీ తామడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు.

గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ వైఫల్యా లను ఎండగట్టారు. 'పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఉద్యోగ సృష్టీ అంతంత మాత్రమే. 2 కోట్ల ఉద్యోగాలను వారు హామీఇస్తే, కేవలం 1.35 లక్షల మందికి ఉపాధి లభించింది. కరవు పీడిస్తోంది. రైతులను ఆదుకునేలా ఒక్క చర్యా తీసుకోలేదు' అని ఆయన అన్నారు. తప్పుడు హామీలను కొనసాగిస్తూ, కాలం నెట్టుకొస్తున్నారు తప్ప దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.