Begin typing your search above and press return to search.

ఆ కలెక్టరు ఎంత మొత్తుకున్నా బాబు వినలేదు!

By:  Tupaki Desk   |   24 April 2017 5:11 AM GMT
ఆ కలెక్టరు ఎంత మొత్తుకున్నా బాబు వినలేదు!
X
వితంతువులు - వృద్ధులు - వికలాంగులకు ఇంతవరకు ఇస్తున్న పెన్షన్లు భారీగా పెంచింది తానేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెబుతుంటారు. కానీ... ఒక వైపు పెన్షన్ డబ్బుల మొత్తం పెంచి మరోవైపు అర్హుల సంఖ్య తగ్గించేశారన్న ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ నిబంధనపై తీవ్ర విమర్శలున్నాయి. కొన్ని కొన్ని కుటుంబాల్లో తల్లి వితంతువు .. పిల్లలంతా వికలాంగులుగా ఉన్నవారు ఉంటున్నారు. అలాంటి కుటుంబాలకు ఈ నిబంధన శరాఘాతమే. అయితే... తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈ విషయంలో సంచలన కామెంట్లు చేశారు. ఆ నిబంధన వద్దని తాము చంద్రబాబుకు ఎంతగా చెప్పినా ఆయన వినలేదని ఆ అధికారి చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ అనే నిబంధన సరికాదని.. ఇది నిరుపేదలు - నిస్సహాయులుకు ఇబ్బందికరంగా మారిందని, ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గుంటూరులో ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కాంతిలాల్ దండే ఈ విషయం చెప్పారు.

అంతేకాదు... ప్రస్తుతం సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు పూర్తిగా అందడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా... ఒక్క ఈ కలెక్టరే కాకుండా చాలామంది కలెక్టర్లు చంద్రబాబుకు ఈ విషయం చెప్పారట. నిత్యం జరిగే కలెక్టర్ల సమావేశాలు ఈ నిబంధన వల్ల కలిగే ఇబ్బదుల ప్రస్తావన లేకుండా ముగియడం లేదని సమాచారం. అయినా.. చంద్రబాబు మాత్రం ఎందుకో ఆ నిబంధన ఎత్తివేయడానికి అస్సలు ఇష్టపడడం లేదట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/