Begin typing your search above and press return to search.

క‌న్నా క‌ల‌క‌లం..బాబు వెన్నులో వ‌ణుకు!

By:  Tupaki Desk   |   16 July 2018 3:09 PM GMT
క‌న్నా క‌ల‌క‌లం..బాబు వెన్నులో వ‌ణుకు!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం ఢిల్లీలో చోటుచేసుకుంది. సీఎం చంద్ర‌బాబుపై ఎదురుదాడిని పెద్ద ఎత్తున చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా సంచ‌ల‌న ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం తన ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కు ఆయ‌న లేఖ ఇచ్చారు. ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఈ రోజు ఉదయం రాజ్‌ నాథ్‌ తో సమావేశమ‌య్యారు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌ మెంట్ తన ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేస్తుందని తెలిపారు. కొన్ని రోజులుగా తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ కన్నా బహిరంగంగానే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో… ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ కన్నా లేఖ రాయడంపై ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

హోంమంత్రితో స‌మావేశం అనంత‌రం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ లో అరాచక పాలన సాగుతోంందని అన్నారు. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. గత నాలుగు సంవ‌త్స‌రాలుగా ఈ పాలనను చూస్తున్నామని.. దీన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎవరూ ప్రశ్నించినా వారిపై కేసులు పెడుతున్నారని వాపోయారు. 2019లో ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీని హెచ్చరించారు. ఇటీవల అనంతపురం పర్యటన సందర్భంగా తనను చంపేందుకు కొందరు టీడీపీ వ్యక్తులు ప్రయత్నించారని కన్నా తెలిపారు. ఆ తరువాత కావలిలో రోడ్డు షో చేస్తున్న సమయంలో… టీడీపీ నాయకులే తమ కార్యకర్త చేత తనపై చెప్పు వేయించారని కన్నా ఆరోపించారు. ఒంగోలులో కూడా పథ‌కం మార్చి తనపై దాడికి పాల్పడ్డారని, దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని కన్నా తెలిపారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్తున్నాననే తనపై భౌతికదాడులు జరుగుతున్నాయని కన్నా తెలిపారు. దీనిపై విచారణ జరిపించి… తగిన చర్యలు తీసుకుంటామని రాజ్ నాథ్ హామీ ఇచ్చారని కన్నా తెలిపారు.