Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ రేంజ్ చెప్పిన క‌న్నా రోడ్ షో!

By:  Tupaki Desk   |   22 Jun 2018 12:37 PM GMT
ఏపీలో బీజేపీ రేంజ్ చెప్పిన క‌న్నా రోడ్ షో!
X
అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా లక్ష్మీనారాయ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. కాపు ఓట్లతో పాటు అనేక స‌మీకర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం ఏరికోరి క‌న్నాకు ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. అందులోనూ సీనియ‌ర్ పొలిటిషియ‌న్ అయిన క‌న్నాకు రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులో మంచి ప‌ట్టుందని భావించిన షా - మోదీలు క‌న్నాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఏపీలో బీజేపీ జెండాను రెప‌రెప‌లాడిస్తార‌ని, `అమ‌రావ‌తి`లో క‌మ‌ల వికాసానికి తోడ్ప‌డ‌తార‌ని భావించారు. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ లో క‌న్నా చేప‌ట్టిన తొలి టూర్ కు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డ‌తార‌ని, దాంతో, ఏపీలో బీజేపీ బ‌లం ఏమిటో తెలుస్తుంద‌ని ఆశ‌ప‌డ్డారు. అయితే, ఆదిలోనే హంస‌పాదు అన్న చందంగా క‌న్నా తొలి టూర్ ఘోరంగా విఫ‌ల‌మ‌వ‌డంతో బీజేపీ అధిష్టానం ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయి.

బీజేపీ రాష్ట్రాధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ బ‌లోపేతం చేసేందుకు క‌న్నా తొలిసారి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించాల‌ని భావించారు.ఢిల్లీ వెళ్లిన క‌న్నా....మోదీ, షాల ఆశీర్వాదం తీసుకొని మ‌రీ జిల్లాల‌ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ను రూపొందించారు. జూన్ 20 ,21 తేదీల్లో శ్రీకాకుళం నుంచి మొద‌లు పెట్టి జులై 4- 5 తేదీల్లో చిత్తూరుతో త‌న ప‌ర్య‌ట‌న ముగించేంద‌కు సిద్ధ‌మ‌య్యారు. కొత్త రాష్ట్రాధ్య‌క్షుడికి కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగతం ప‌లుకుతార‌ని, భారీ సంఖ్య‌లో జ‌నం హాజ‌ర‌వుతార‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. అయితే, తీరా శ్రీ‌కాకుళంలో ప‌ర్య‌టిస్తోన్న క‌న్నా కాన్వాయ్ వెనుక ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా లేక‌పోవ‌డంతో బీజేపీ నేత‌లు విస్తుపోయారు. ఓపెన్ టాప్ జీప్ లో అభివాదం చేస్తోన్న క‌న్నాకు ప్ర‌తి అభివాదం చేసేవారే క‌రువ‌య్యారు. ఏదో నామ్ కా వాస్తే కాన్వాయ్ అలా సాగిపోవడంతో క‌న్నాతో పాటు బీజేపీ నేత‌ల‌కు షాక‌య్యారు. ఈ రోడ్ షో కు వ‌చ్చిన స్పంద‌న‌తో ఏపీలో బీజేపీకి ఏపాటి ఆద‌ర‌ణ ఉందో స్ప‌ష్ట‌మైంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. మ‌రి, తొలి బంతికే క‌న్నా క్లీన్ బౌల్డ్ అవ‌డంతో బీజేపీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.