Begin typing your search above and press return to search.

చేయాల్సింది త‌ప్ప బాబు అన్నీ చేస్తాడు-క‌న్నా!

By:  Tupaki Desk   |   11 Jun 2018 9:54 AM GMT
చేయాల్సింది త‌ప్ప బాబు అన్నీ చేస్తాడు-క‌న్నా!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అవినీతి.. అక్ర‌మాల‌తో ఏపీని చంద్ర‌బాబు భ్ర‌ష్టుప‌ట్టించార‌న్నారు. స‌భ్య స‌మాజం చంద్ర‌బాబు ఆయ‌న ప‌రివారాన్ని చూసి సిగ్గుతో త‌ల‌దించుకుంటుంద‌న్నారు. అమ‌రావ‌తిలోని ధ‌ర్నా చౌక్ ద‌గ్గ‌ర బీజేపీ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

కేంద్ర ప్ర‌భుత్వంపై నింద‌లు వేస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటున్న చంద్ర‌బాబు తీరును నిర‌సిస్తూ.. ఈ రోజు ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ ముఖ్య‌మంత్రిపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.ఈ కార్య‌క్ర‌మంలో కన్నాతో పాటు పురంధేశ్వ‌రితో స‌హా ప‌లువురు నేత‌లు హాజ‌రయ్యారు. చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన క‌న్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య అక్ర‌మ సంబంధాన్ని అంట‌క‌ట్టార‌ని.. వారికి ఓటు వేస్తే..బీజేపీకి ఓటు వేసిన‌ట్లేన‌ని దుర్మార్గ‌పు మాట‌లు మాట్లాడుతున్నార‌న్నారు.

బాబుకు భ‌గ‌వంతుడు మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పిన క‌న్నా.. రాష్ట్రంలో అవినీతి.. ఆరాచ‌క పాల‌న సాగుతోంద‌న్నారు. ఏపీ రాష్ట్ర అవినీతిలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి మొద‌లు జ‌న్మ‌భూమి కార్య‌క‌ర్త వ‌ర‌కూ మ‌మేకం అయ్యార‌న్నారు. ఏపీ అభివృద్ధి కోసం ప్ర‌ధాని మోడీ కృషి చేస్తే.. ఆయ‌న మీద త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి.. ఏపీకి ఏమీ చేయ‌లేదంటూ ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొడుతున్నాన్నారు. 13జిల్లాల ఏపీకి రూ.1.26 ల‌క్ష‌ల కోట్లు ఇస్తే.. ఏపీకి రెట్టింపు జిల్లాలు ఉన్న క‌ర్ణాట‌క‌కు కేవ‌లం రూ.76వేల కోట్లు మాత్ర‌మే కేంద్రం ఇచ్చింద‌ని.. ఇదంతా ఏపీ ప్ర‌జ‌ల మీద ఉన్న ప్రేమ‌తోనే అని క‌న్నా వ్యాఖ్యానించారు.

ఇచ్చిన ల‌క్ష‌ల కోట్ల డ‌బ్బుల‌కు లెక్క‌లు అడిగితే.. న‌న్ను లెక్క‌లు అడుగుతున్నారంటూ బాబు నోరు పారేసుకుంటున్నార‌న్నారు. నేను స్పెష‌ల్ ఫ్లైట్స్ లో తిరుగుతాను.. సెవ‌న్ స్టార్ హోట‌ళ్ల‌లో ఉంటాను.. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల క‌ల్యాణ మండ‌పాలు క‌ట్టించుకుంటానంటూ ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌న్నారు. త‌న‌కు తోచిన‌ట్లుగా.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా బాబు డ‌బ్బుల్ని వృధా చేశార‌న్నారు. హ్యాపీ సండే పేరుతో పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఒక్కో హ్యాపీ సండేకు రూ.50 కోట్ల చొప్పున ఖ‌ర్చు చేయ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌లంతా హ్యాపీగా ఉన్నారా? హ‌్యాపీ సండే పేరుతో కార్య‌క్ర‌మాలు చేప‌డితే ప్ర‌జ‌లు సంతోషంగా ఉండ‌రు క‌దా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. బాబు అవినీతిపై పుస్త‌కం వేస్తే 300 పేజీలు కూడా స‌రిపోవ‌న్నారు. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏ ప‌థ‌కాన్ని విడిచిపెట్ట‌కుండా అన్ని ప‌థ‌కాల్ని అప్ప‌జెప్పేసిన బాబు.. 2019లో చెప్పేందుకు ఏ ప‌థ‌కాలు మిగ‌ల్లేవ‌న్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబు.. మోడీని త‌ప్పు ప‌డుతూ ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల్ని రెచ్చ‌గొడుతున్నార‌న్నారు. 2019లో ప్ర‌జ‌ల‌కు చెప్ప‌టానికి ఏ ప‌థ‌కం మిగ‌ల్లేద‌ని.. ఒక‌వేళ చెప్పినా ఆయ‌న్ను న‌మ్మే ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌జ‌లు లేర‌న్నారు. ఈ కార‌ణంతోనే మోడీ మీద లేనిపోనివి సృష్టించి ఆరోప‌ణ‌లుచేస్తూ రెచ్చ‌గొడుతున్నార‌న్నారు.

ఏపీ రాజ‌ధాని పేరుతో భూకుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డార‌ని.. ఏపీలో ఎందులో చూసినా అవినీతి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌న్నారు. బాబును న‌మ్మి మోడీలాంటి పెద్ద వ్య‌క్తిమ‌ద్ద‌తు ఇస్తే.. ఆయ‌న్ను మోసం చేశార‌న్నారు. బాబు ర‌క్తంలోనే మోసం చేసే గుణం ఉంద‌న్నారు. అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీ చేతుల్ని న‌రికేసిన బాబు.. న‌మ్మి పిల్ల‌ను ఇచ్చిన మామ‌ను క్షోభ పెట్టి చంపావ్‌.. న‌మ్మి అధికారంలోకి తెచ్చిన మోడీని మోసం చేశావంటూ నిప్పులు చెరిగారు. గ‌తంలో పెద్ద‌మ‌నిషి వాజ్ పేయ్ ను మోసం చేసిన‌ప్ప‌టికీ.. మారిన కాలంతో పాటు పెరిగి బాబు వ‌య‌సుతో మారి ఉంటార‌ని మోడీ భావించార‌ని.. కానీ బాబు త‌న తీరుతో మ‌ళ్లీ మోసం చేశార‌న్నారు. తెల్లారి లేచింది మొద‌లు బీజేపీని తిట్ట‌ట‌మే ప‌నిగా పెట్టుకున్న బాబు.. అదే ప‌నిగా తిడుతున్నార‌న్నారు. రాష్ట్రంలో ఏ చిన్న అవ‌కాశం లేకుండా అన్నిచోట్ల అవినీతి కార్య‌క‌లాపాలు చేస్తున్నార‌న్నారు. ధాన్యం ప్రొక్యూర్ మెంట్లోనే అవినీత‌ని.. అంత‌కు మించి ధాన్యం నింపు సంచుల్లోనూ అవినీతి ఉంద‌న్నారు. పోల‌వ‌రం త‌న క‌ల‌గా చెప్పే చంద్ర‌బాబు.. ఆ ప్రాజెక్టుకు అయ్యే ప్ర‌తి పైసాను కేంద్ర‌మే ఇస్తుంద‌న్నారు. అంతేకాదు.. చంద్ర‌న్న బీమాకు నిధులు ఇచ్చేది కేంద్ర‌మేన‌న్నారు. కేంద్రం ఇచ్చే నిధుల‌కు తాను ఇచ్చిన‌ట్లుగా బాబు బిల్డ‌ప్ ఇస్తారంటూ ఉతికి ఆరేశారు.