Begin typing your search above and press return to search.

పే..ద్ద సాములోరి ఆరోగ్యం కండీషన్ సీరియస్..?

By:  Tupaki Desk   |   30 Aug 2016 6:27 AM GMT
పే..ద్ద సాములోరి ఆరోగ్యం కండీషన్ సీరియస్..?
X
దేశంలో ఎన్ని పీఠాలు ఉన్నా.. మరెంతమంది స్వామీజీలు ఎంతమంది ఉన్నా.. కంచి కామకోటి పీఠాధిపతి స్థానం అంటే అందరికి ఎంతో గౌరవ మర్యాదలు. దేశంలోని ప్రముఖ పీఠాల్లో కీలకభూమిక పోషించే కంచికామకోటికి సంబంధించిన ఒక విషయం కోట్లాది మంది భక్తుల్లో కలకలం రేపుతోంది. కంచికామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆయన.. ఈ ఉదయం శ్వాస తీసుకోవటంలో పడుతున్న ఇబ్బందిని గుర్తించిన శిష్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. విజయవాడలోని సూర్యారావు పేటలో ఉన్న ఆంధ్రా ఆసుపత్రిలో చేర్చిన ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో అత్యవసర చికిత్స జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. జయేంద్ర సరస్వతికి ప్రస్తుతం ఐదుగురు వైద్యుల బృందం చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం జయేంద్ర సరస్వతి ఆరోగ్యం సీరియస్ గా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స చేస్తున్న నేపథ్యంలో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి వ్యాఖ్యచేసినా అది తొందరపాటు అవుతుందని.. పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాక ఒక నిర్ణయానికి రావటం బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. పె..ద్ద స్వాములోరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఆయన శిష్యులు మాత్రం స్వామీజీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. సీరియస్ గా ఉందన్నది ఉత్త మాటేనని చెబుతున్నారు. వైద్యుల ప్రకటన తర్వాతే స్వాములోరి ఆరోగ్య పరిస్థితిపై ఒక అవగాహనకు రావొచ్చు.