Begin typing your search above and press return to search.

బీజేపీపై కొత్త కామెంట్ చేసిన కంచ ఐల‌య్య‌

By:  Tupaki Desk   |   15 April 2018 5:53 PM GMT
బీజేపీపై కొత్త కామెంట్ చేసిన కంచ ఐల‌య్య‌
X
రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య చిన్న పుస్త‌కంతో పెద్ద క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అంటూ ఆయ‌న రాసిన పుస్త‌కం తెలుగు రాష్ర్టాల్లో సృష్టించిన సంచ‌ల‌నం, వివాదం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ర్టాల్లో భ‌గ్గుమ‌న్న నిర‌స‌నలు, పోలీసులు గృహనిర్భంధం, అరెస్టులు, విజ‌య‌వాడ‌లో స‌న్మాన‌స‌భకు రాకుండా అడ్డుకోవ‌డం వంటి ఉదంతాలు తెలిసిన సంగ‌తే. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిన అనంత‌రం తెలంగాణ‌లో ప‌లు ప్ర‌జా సంఘాల వేదిక‌గా క‌మ్యూనిస్టుల్లోని సీపీఎం సార‌థ్యంలో కొన‌సాగుతున్న టీమాస్ రాష్ట్ర చైర్మన్‌గా ఉన్న‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ఎన్నికయ్యారు. ఇలా సొంత వేదిక‌తో ముందుకు సాగుతున్న ఐల‌య్య ఒకింత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చారు.

విజ‌య‌వాడ‌లో ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మై వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని కంచె ఐలయ్య విమర్శించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా సీట్లు రాకూడదని కోరుకుంటున్నానని ఆయ‌న అన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమంతో పాటు సామాజిక న్యాయంపై కూడా పోరాటం జరగాలని కంచ ఐల‌య్య ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. దళిత, బహుజన మేధావులు రాజకీయ శక్తి నిర్మాణం ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని, టీ మాస్ ఇందులో ఒక ముంద‌డుగు అని పేర్కొన్నారు. టీ మాస్‌ ఒక రాజకీయ పార్టీ కాదని, ప్రజా సమస్యలే ప్రాతిపదికగా సామాజిక, ప్రజా సంఘాలతో ఏర్పడ్డ వేదికని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించటమే తమ ఫోరం లక్ష్యమని, ఇదే రీతిలో ఏపీలో కూడా ప్ర‌జ‌లు ఉద్య‌మించాల‌న్నారు. అమరావతిలో ఎస్సీ-ఎస్టీ-బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు.

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీలకు మద్దతిస్తాం.. దాన్ని వ్యతిరేకించే పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని కంచ ఐల‌య్య‌ స్పష్టం చేశారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలని అన్నారు. ప్రభుత్వరంగాన్ని కాపాడుకుంటూనే ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేయాలని, ఇంటర్మీడియట్‌ విద్యను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తమ ఫోరం రక్షణ కల్పిస్తుందని చెప్పారు.