Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ రంగంలోకి దిగితే రిజ‌ల్ట్ ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   20 Jan 2017 5:24 AM GMT
ప‌వ‌న్ రంగంలోకి దిగితే రిజ‌ల్ట్ ఇలా ఉంటుంది
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నం ఫ‌లించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ రోగుల పరీక్షల కోసం ఇంటింటి సర్వేకు నాంది పలికింది. సుమారు 800 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించేందుకు వైద్య - ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉద్దానంలో కిడ్నీ రోగాలను నిర్థారించేందుకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్దానంలో కిడ్నీవ్యాధి మూలాల అన్వేష‌ణకు సోంపేటలో పరిశోధన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం సహయంతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీని కోసం తాను శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ - కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను వివరిస్తానన్నారు.

ఉద్దానం లో ఆరు ప్రత్యేక బృందాలు పర్యటించగా..1982 నుంచి ఉద్దానంలో కిడ్నీకి సంబంధించిన రోగాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన నివేదికలన్నీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ ప్రకాష్ నడ్డాకు మంత్రి కామినేని శుక్రవారం అందజేయనున్నారు. ఐసీఎంఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ అంతటా 19 డయాలసిస్ కేంద్రాలకు సాయం అందించాలంటూ కామినేని కేంద్రప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇచ్చాపురం - సోంపేట - పలాస - మందస - కవిటి ప్రాంతాల నుంచి సుమారు 800 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మీడియాతో మాట్లాడారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కిడ్నీవ్యాధులపై కార్యాచరణ ప్రణాళికను వైద్య - ఆరోగ్య శాఖ రూపొందించిందని, అందులో భాగంగానే ఆరు సంచార వైద్య పరీక్షల వాహనాలను ప్రారంభించామన్నారు. నాలుగు నెలల్లో ఉద్దానం ప్రాంత ప్రజల హెల్త్‌ ప్రొఫైల్ నివేదిక తయారు చేస్తామని వివరించారు. కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణమైన రెండు పరీక్షలను చేస్తారని, అందులో కిడ్నీ వ్యాధి సోకినట్లయితే, అటువంటి వారిని 108 వాహనం ద్వారా సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువచ్చి మరో 40 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని చెప్పారు. రానున్న 60 రోజుల్లో పలాస - సోంపేట ప్రాంతాలలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. ఉద్దానం ప్రాంతంలో గల 107 గ్రామాలలో కిడ్నీ వ్యాధి పెనుభూతంలా మారి కారణాలు తెలియని సమస్యగా ఉందని, ఈ ప్రాంత ప్రజలకు ఈ వ్యాధి నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించామన్నారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తుందన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు - బస్ పాస్‌ లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సోమవారం నుంచే సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పెండింగ్‌ లో ఉన్న ప్రజల ఆవేద‌నకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగంలోకి దిగిన త‌ర్వాత ప‌రిష్కారం కావ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ప‌వ‌న్ అభిమానులు ద‌టీజ్ ప‌వ‌న్ ప‌వ‌ర్ అంటూ ప్ర‌క‌టిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/