Begin typing your search above and press return to search.

భాజపాలో బాబుకోటరీ.. ప్లేటు మారుస్తోందా?

By:  Tupaki Desk   |   23 Feb 2018 12:09 PM GMT
భాజపాలో బాబుకోటరీ.. ప్లేటు మారుస్తోందా?
X
రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో కొందరు నాయకుల మీద చంద్రబాబునాయుడు వర్గం అనే ముద్ర ఉంది. ప్రధానంగా ఆయన కేబినెట్ లోని మంత్రి కామినేని శ్రీనివాస్ - శాసనసభ సాక్షిగా చంద్రబాబునాయుడు అద్భుతంగా పరిపాలన సాగించేస్తున్నారని కితాబులు ఇస్తూ ఉండే ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు - ఎంపీ కంభంపాటి హరిబాబు మరికొందరి మీద అలాంటి ముద్ర ఉంది. అయితే ఆ రకమైన అనుకూల వర్గం కూడా ఇప్పుడు చంద్రబాబుకు ప్రతికూలంగా ప్లేటు ఫిరాయిస్తున్నట్లు కనిపిస్తోంది.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు.. తమ పార్టీ నేత సోము వీర్రాజు ను తాజాగా వెనకేసుకు వచ్చారు. చంద్రబాబు పేరెత్తితేనే ఒంటికాలిమీద లేచే నాయకుడిగా గుర్తింపు ఉన్న సోము వీర్రాజుకు ఆమధ్య ఇదే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు - ఆయన మాటలన్నీ కరక్టే అంటూ వెనకేసుకు రావడం చూస్తోంటే.. భాజపాలోని బాబు వర్గంలో కూడా అనివార్యమైన మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది.

వీర్రాజు వ్యాఖ్యలు ఎవరిమీద వ్యక్తిగత ఆరోపణలుగా ఉండవని, ఎవరు మాట్లాడినా సరే.. రాష్ట్రంలో తమ పార్టీని కాపాడుకోవడానికే మాట్లాడుతున్నాం అని కంభంపాటి హరిబాబు వివరించారు. సోము వీర్రాజు తాజాగా ప్రత్యేకహోదా అంశాన్ని ఎత్తుతున్న చంద్రబాబు.. దాన్ని గతంలో ఏరకంగా వ్యతిరేకించారో.. ఆయన స్వయంగా ఏ రకంగా ప్రత్యేకహోదాను తుంగలో తొక్కారో వివరించడం ప్రారంభించారు. గతంలో హోదా అనే మాటెత్తితే జైళ్లకు వెళ్తారని, హోదాకోసం ఆందోళనలు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించింది చంద్రబాబే కదా అని ఆన గుర్తు చేస్తున్నారు. ఈ రకమైన వ్యాఖ్యల నేపథ్యంలో సోము వీర్రాజు వాస్తవాలే చెబుతున్నారంటూ రాష్ట్ర అద్యక్షుడు హరిబాబు మద్దతివ్వడం విశేషం.

గంటాతో భేటీనే ట్విస్టు

నిజానికి విశాఖ కేంద్రంగా రెండు పార్టీల నుంచి కీలకంగా రాజకీయాలు నడుపుతున్న నాయకులు గంటా శ్రీనివాసరావు - కంభంపాటి హరిబాబు. ఈ ఇద్దరి మధ్య కూడా ఇటీవలి ప్రతిష్టంభన నేపథ్యంలో వాగ్యుద్ధం నడిచింది. హరిబాబు విడుదల చేసిన 27 పేజీల లెక్కలు - వాటిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని గంటా సవాలు విసిరారు. బహిరంగ చర్చ జరగలేదు గానీ.. గంటాతో... కంభంపాటి హరిబాబు ఆంతరంగికంగా సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది.