Begin typing your search above and press return to search.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు చెప్పేసిన కాంగ్రెస్ సీఎం!

By:  Tupaki Desk   |   22 April 2019 5:33 AM GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు చెప్పేసిన కాంగ్రెస్ సీఎం!
X
మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్ నాథ్ తాజాగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. దీనికి కార‌ణం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మూడో ద‌శ పోలింగ్ డేట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. దీంతో.. ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రింత పుంజుకుంది.

క‌మ‌ల్ నాథ్ కుమారుడు న‌కుల్ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఛింద్ వాడా లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొడుకు గురించి క‌మ‌ల్ నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగిన కొడుకును గెలిపించాల‌ని కోరారు. మీ ఆశీర్వాదం కావాల‌న్న ఆయ‌న‌.. అత‌డికి తాను బాధ్య‌త అప్ప‌గించాన‌ని.. ఏ ప‌ని చెప్పినా పూర్తి చేస్తాడ‌ని..ఒక‌వేళ ప‌ని చేయ‌లేక‌పోతే అత‌డి దుస్తులు చింపేయాలంటూ వ్యాఖ్యానించారు.

కొడుకు గెలుపు కోసం విప‌రీతంగా శ్ర‌మిస్తున్న ఆయ‌న‌.. ఈ తీరులో వ్యాఖ్య‌లు చేయ‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల మీదా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రోటీన్ కు భిన్నంగా ఉన్నాయ‌నే చెప్పాలి. త‌న అంచ‌నా ప్ర‌కారం కేంద్రంలో సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన మెజార్టీ లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఈ ఎన్నిక‌ల్లో హంగ్ వ‌స్తుంద‌న్నారు.

త‌న‌కున్న అంచ‌నా ప్ర‌కారం హంగ్ పార్ల‌మెంటు ఏర్ప‌డుతుంద‌ని.. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. బీజేపీకి మ‌ళ్లీ ప‌వ‌ర్ చేతికి రావ‌టం క‌లేన‌ని చెప్పిన ఆయ‌న‌.. త‌మ రాష్ట్రం వ‌ర‌కూ మెరుగైన ఫ‌లితాల్ని సాధిస్తామని న‌మ్మ‌కంగా చెప్పారు. త‌మ‌కుత‌గినంత సంఖ్యాబ‌లం వ‌చ్చి అధికారం చేప‌డితే రాహుల్ గాంధీనే ప్ర‌ధానిగా అభివ‌ర్ణించారు. త‌మ‌కే కాదు.. బీజేపీతో స‌హా ఏ పార్టీకి మెజార్టీ రాద‌ని.. మిత్ర‌ప‌క్షాల స‌హ‌కారంతోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న‌ను వినిపించారు.