Begin typing your search above and press return to search.

క‌లాం ఇంటి నుంచి క‌మ‌ల్ క‌థ షురూ!

By:  Tupaki Desk   |   18 Jan 2018 5:30 PM GMT
క‌లాం ఇంటి నుంచి క‌మ‌ల్ క‌థ షురూ!
X
ఉత్త‌రాది-దక్షిణాది విష‌యంలో సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఏకమై ద్రవిడ వాణి వినిపించాలని కోరారు. దక్షిణ భారత మంతా ఒక్కటైతే కేంద్రాన్ని శాసించగలదని అభిప్రాయపడ్డారు. ‘ఆనంద వికటన్‌’ తమిళ పత్రికలో ఈ వారం రాసిన తన కాలమ్‌ లో ఈ మేరకు పిలుపునిచ్చారు. త‌న కొత్త పిలుపున‌కు ప‌న్నులు లెక్కగా క‌మ‌ల్ హాస‌న్‌ తీసుకున్నారు.

‘దేశానికి పన్నుల రూపంలో పెద్దమొత్తంలో ఆదాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. తమిళనాడులో వసూలు చేస్తున్న పన్నుల ఆదాయాన్ని కేంద్రం ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి వినియోగిస్తోందని (దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని) కొందరు అంటున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఇలా ఎలా చేస్తారన్నది నా ప్రశ్న. ఇంటిని పోషించే పెద్దవారు చిన్నవాళ్ల ఆకలి కూడా తీర్చాలి. కానీ అలాగే వదిలేయకూడదు కదా’ అని క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌శ్నించారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష పాటించకుండా చూడటానికి దక్షిణాది రాష్ట్రాలు ఒకే గొంతుక వినిపించాలని కమల్‌ అభిలషించారు. ‘దక్షిణ భారత మంతటా ద్రవిడ సంస్కృతి ఉంది. చంద్రశేఖర్‌ రావు (తెలంగాణ సీఎం) - చంద్రబాబు(ఏపీ సీఎం) - సిద్దరామయ్య(కర్ణాటక సీఎం) - పినరాయి విజయన్‌(కేరళ సీఎం)లు కూడా ద్రవిడులే. వీరంతా ఏకమై నినదిస్తే దక్షిణాది పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష పోతుంది. మనమంతా ఏకమైతే కేంద్రంతో మాట్లాడవచ్చు’ అని తన వ్యాసంలో పేర్కొన్నారు.

ద్రవిడులు అంటే ఒక్క తమిళులే అన్న వాదంతో తాను ఏకీభవించనని - దక్షిణాదిలోని మిగతా భాషలు మాట్లాడేవారు కూడా ద్రవిడులేని క‌మ‌ల్ హాస‌న్ త‌న కాల‌మ్‌ లో పేర్కొన్నారు. శివతత్వం వలె ద్రవిడతత్వం కూడా దక్షిణాది అంతటా ఉందన్నారు. తమిళనాడులో తన రాజకీయ పర్యటనను వచ్చేనెల 21న రామనాథపురంలోని దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నివాసం నుంచి ప్రారంభిస్తానని కమల్‌ తెలిపారు. కలాం వలె తాను కూడా రామనాథపురంలోనే జన్మించానని, ఉజ్వల తమిళనాడు కోసం కలలుగనాలన్న కలాం ఆలోచన దృక్ఫథంతో ఏకీభవిస్తానని పేర్కొన్నారు.