Begin typing your search above and press return to search.

గెలిచేందుకు ‘కమల్ ’ కొత్త అస్త్రం ఇదే..

By:  Tupaki Desk   |   22 Jun 2019 9:11 AM GMT
గెలిచేందుకు ‘కమల్ ’ కొత్త అస్త్రం ఇదే..
X
2014లో అఖండ భారత దేశంలో నరేంద్రమోడీని అద్భుత మెజారిటీతో గెలిపించడంలో రాజకీయ వ్యూహాల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బీహార్ లో జేడీయూను గెలిపించారు. ఇక మొన్నటి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ ను విజయతీరాలకు చేర్చాడు. అందుకే ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్(పీకే) ఐడియాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాట నటుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ పార్టీ బొక్కబోర్లా పడింది. దీంతో రాబోయే స్థానిక సంస్థలు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఎలా పుంజుకోవాలి.? ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమల్ హాసన్ ఇటీవల ‘ఆళ్వార్ పేట’లోని పార్టీ కార్యాలయంలో ప్రశాంత్ కిషోర్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పుడీ భేటితో పీకే సాయం కమల్ తీసుకోబోతున్నాడని స్పష్టమైంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.

ఇప్పటికే అధికార అన్నాడీఎంకే పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో ప్రశాంత్ కిషోర్ ను రాబోయే 2021 అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తగా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. అయితే అంతకుముందే కమల్ హాసన్ పీకేతో భేటి కావడం తమిళనాడు పాలిటిక్స్ లో హీట్ పెంచింది.

ఇలా ప్రశాంత్ కిశోర్ టీంకు ఇప్పుడు దేశంలోనే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆయనను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు. మరి మోడీ, జగన్ అయినట్టే కమల్ కూడా తమిళనాట పీకే చలవతో అధికారంలోకి వస్తాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే.