Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ క‌న్ఫ్యూజింగ్ ట్వీట్స్‌!

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:56 PM GMT
క‌మ‌ల్ క‌న్ఫ్యూజింగ్ ట్వీట్స్‌!
X
జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ రాజ‌కీయాల‌లో పెను మార్పులు సంభ‌వించాయి. త‌మిళ సూప‌ర్ స్టార్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. అభిమానుల‌తో నిర్వ‌హించిన ఫొటో సెష‌న్ సంద‌ర్భంగా ర‌జ‌నీ త‌న రాజ‌కీయ అరంగేట్రంపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. అదే త‌ర‌హాలో స్టార్ హీరో క‌మ‌ల్ హ‌స‌న్ కూడా కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వంపై, రాజ‌కీయ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు ట్విట్ల‌ర్లో సంకేతాలిచ్చారు. అయితే, క‌మ‌ల్ ఈ మ‌ధ్య చేస్తున్న వ్యాఖ్య‌లు అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌ల‌ను క‌న్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి. తాను ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని ఒక‌సారి, పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రాన‌ని మ‌రోసారి క‌మ‌ల్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు త‌మిళ జ‌నాల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నాయి.

త‌న‌లాంటి కోపిష్టికి రాజ‌కీయాలు సూట్ కావంటూనే రాజకీయాల గురించే చర్చిస్తుంటాడు క‌మ‌ల్‌. ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశంపై సెటైర్లు వేస్తాడు.. కొన్ని నెలలుగా కమల్ హాసన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే తమిళ జనాలకు వెర్రెత్తిపోతోంది. గ‌తంలో సినిమాల గురించి ట్వీట్లు పెట్టే క‌మ‌ల్ ఇపుడు కేవ‌లం రాజ‌కీయాల గురించి మాత్ర‌మే ట్వీట్ చేస్తున్నాడు. తాజాగా క‌మ‌ల్ చేసిన ట్వీట్లు ఎవ‌రిని ఉద్దేశించి చేసిన‌వో అర్థం కాక త‌మిళ తంబీలు జుట్టు పీక్కుంటున్నారు.

త‌మిళ‌నాడులోని రాజ‌కీయ పార్టీల‌పై, సీఎంపై క‌మ‌ల్ మ‌రోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు తేలితే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని.. కానీ తమిళనాట ఏ రాజకీయ పార్టీ కూడా సీఎం రాజీనామా కోసం డిమాండ్ చేయట్లేదని.. ఇప్పటికే రాష్ట్రంలో చాలా నేరాలు జరిగాయని కమల్ ట్వీట్ చేశాడు. తమిళనాడును అభివృద్ధి చేయ‌డ‌మే త‌న లక్ష్యమని.. తన మాటకు బలాన్నిచ్చే సాహసం ఎవరు చేస్తారో చూడాల‌ని క‌మ‌ల్ అన్నాడు. డీఎంకే.. అన్నాడీఎంకే పార్టీలు సాయం చేసే పనిముట్లు మాత్రమే అని.. ఆ పనిముట్లు మొద్దుబారితే.. ప్రత్యామ్నాయాలు చూడాలని కమల్ అన్నాడు.

త‌మిళ‌నాట పాతుకుపోయిన ఆ రెండు పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయాలు చూడాల‌ని క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి. అవినీతి-రాజీనామా అంటూ కమల్ టార్గెట్ చేసింది ఎవ‌రినో తెలియ‌క త‌మిళ ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డ్డారు. ప్రస్తుత ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారని కొందరు అంటున్నారు. త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఏమిటో చెప్ప‌కుండా కేవ‌లం సోష‌ల్ మీడియాలో కామెంట్లకే పరిమితం అవుతున్న కమల్ పై ప‌లువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తనే స్వయంగా రాజకీయాల్లోకి వచ్చి రాజ‌కీయ‌ వ్యవస్థను మార్చొచ్చు కదా అని క‌మ‌ల్‌ పై సెటైర్లు వేస్తున్న నెటిజ‌న్లు ఉన్నారు.