Begin typing your search above and press return to search.

ఎపీలో ఇంకో ఎన్నిక రెడీగా ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:09 PM GMT
ఎపీలో ఇంకో ఎన్నిక రెడీగా ఉంద‌ట‌
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్త‌యి దాదాపు మూడేళ్లు ముగుస్తున్న స‌మ‌యం వ‌ర‌కు ఎలాంటి సంద‌డి లేని ఏపీలో ఇప్పుడు వ‌రుస ఎన్నిక‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ నేత భూమా నాగ‌రెడ్డి మ‌ర‌ణంతో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌ధాన పార్టీల‌కు ఒక రకంగా ప‌రీక్ష‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే కోర్టు ఆదేశాల మేరకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ఆ పార్టీలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇదో రీతిలో మరో కీల‌క ఎన్నిక ఉండ‌నుంద‌ని అంటున్నారు. అదే ఏపీ ఆర్థిక రాజ‌ధాని అయిన విశాఖ‌కు చెందిన గ్రేటర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌.

ఇటీవలే గ్రేటర్ విశాఖ పరిధిలో 82 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో గ్రేటర్ విశాఖలో అనకాపల్లి పురపాలక సంఘంతోపాటు మండలంలోని కొప్పాక - రాజుపాలెం - పరవాడ మండలంలోని సాలాపువానిపాలెం - తాడి గ్రామాలు సైతం విలీనమయ్యాయి. అలాగే భీమునిపట్నం మున్సిపాల్టీ కూడా విలీనమయింది. 2013 జూలై 30న ఈ ప్రక్రియ జరిగింది. జీవీఎంసీకి ఎన్నికలు జరపకపోవడంతో అనకాపల్లి పట్టణం విలీన గ్రామాల్లో జవాబుదారీతనం కొరవడింది. 50వేల జనాభాకు ఒక వార్డుగా నిర్ణయించనున్నట్లు తెలిసింది. ఆ ప్రకారం అనకాపల్లి పట్టణంలో 84వేలు, విలీన గ్రామాల్లో 16వేల జనాభా ఉంది. వెరసి లక్ష జనాభా ఉన్నందున రెండు వార్డులు ఏర్పాటు కానున్నాయి.కోర్టు తీర్పుతో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్లే...ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రేటర్ విశాఖ ఎన్నికల నగారా కూడా మోగే సమయం ఆసన్నం కాబోతోంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక స్థానిక రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే....అనకాపల్లి జోనల్ పరిధిలోని ఈ రెండువార్డుల్లో గెలుపోటములు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వ్యక్తిగత ప్రతిష్ఠకు పెద్ద సవాల్ కానుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇక్కడి ఎమ్మెల్యేగా పీలా గెలుపొందడం - జీవీఎంసీలో పాలకవర్గం లేకపోవడంతో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇక్కడి పాలన అంతా సాగుతోంది. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం సాగుతోంది.అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్‌ సీపీ ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్‌ నాథ్ గ‌త కొద్దికాలంగా ఈ ప్రాంతంలో రాజకీయంగా పట్టు సాధించేందుకు తనదైన పంథాలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలను అటు అధికార తెలుగుదేశం, ఇటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల భవితవ్యానికి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది.

అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌లు అధికార‌ - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఊరిస్తున్నాయ‌ని అంటున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీకి దిగేందుకు అధికార తెలుగుదేశం పార్టీ తరపున చాలామంది నేతలే కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని సైతం ఆశించే నేతలు స్థానిక అధికార తెలుగుదేశం పార్టీలో ఉండటం విశేషం. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ పదవిని ఆశించిన నేతలు కూడా టిక్కెట్ కోసం తహతహలాడుతున్నారు. అయితే వార్డులు విభజన - రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో రాజకీయ వరాలు తీవ్ర అయోమయ గందరగోళ పరిస్థితుల్లో సతమతమవుతున్నారు. మొత్తంగా జీవీఎంసీ ఎన్నిక అస్ప‌ష్ట‌త‌కు ఒక‌ట్రెండు నెల‌ల లోపే పూర్తి క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.