Begin typing your search above and press return to search.

వామ్మో.. ‘అదిమూలం’ ఆస్తి వెయ్యి కోట్లా?

By:  Tupaki Desk   |   2 May 2016 7:08 AM GMT
వామ్మో.. ‘అదిమూలం’ ఆస్తి వెయ్యి కోట్లా?
X
అవినీతితో ఒక మధ్య శ్రేణి ప్రభుత్వ ఉద్యోగి ఎంతమేర ఆస్తుల్ని కూడబెట్టొచ్చు? పది కోట్లు.. ఇరవై కోట్లు.. లేదంటే వంద కోట్లు. మరీ అంత పెద్ద మొత్తమా అని అనొచ్చు. కానీ తాజాగా భాగోతం వింటే మాత్రం గుండెలు అవిసిపోతాయి. వందకోట్ల ఆస్తులు ఏమూలకు అన్నట్లుగా ఉంటుంది ఆదిమూలం మోహన్ యవ్వారం వింటే. ఇతగాడి ఆస్తుల విలువ ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటాయన్న మాట ఇప్పుడు సంచలనంగా మారింది. అంత భారీ మొత్తమా అని విన్నోళ్ల నోట వెంట మాట రాకుండా పోవటం ఖాయం. గడిచిన కొద్ది రోజులుగా కాకినాడ డిప్యూటీ రవాణా కమిషనర్ అవినీతి భాగోతం కథలు.. కథలుగా వింటున్న పరిస్థితి. అయ్యగారి అవినీతి భాగోతం తవ్వేకొద్దీ గుట్టలు గుట్టలుగా ఆస్తులు బయటకు రావటమే కాదు.. వాటి విలువ కట్టలేక ఏసీబీ అధికారులు అలిసిపోతున్నారట.

తన అవినీతితో మూడు రాష్ట్రాల్లో ఆస్తుల్ని భారీగా కూడబెట్టిన ఆదిమూలం మోహన్ ఆస్తులను అధికారులు తొలుత రూ.వంద కోట్లుగా మాత్రమే అంచనా వేశారు. అయితే.. తవ్వే కొద్దీ బయటకు వస్తున్న ఆస్తులు అంతకంతకు పెరిగి ఇప్పుడు వెయ్యి కోట్లకు పైనే ఉందన్న మాట షాకింగ్ గా మారింది. ఆయన సతీమణి స్వస్థలమైన బళ్లారిలోనూ.. ఇద్దరు కుమార్తెల పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

గడిచిన నాలుగు రోజులుగా మోహన్ కు సంబంధించిన ఆస్తుల మీద ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ కు సంబంధించిన ఆస్తులతో పాటు.. ఆయన బినామీల వివరాలు బయటకు వస్తున్నాయి. అవినీతి సొమ్ము మాత్రమే కాదు.. పలు బ్యాంకుల నుంచి బినామీ పేర్లతో కోట్లాది రూపాయిలు రుణం తీసుకొని ఎగ్గొట్టిన వైనం అధికారులను నివ్వెర పరుస్తోంది. హైదరాబాద్ లోని పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయిలు అప్పులు తీసుకొని.. ఎగవేసినట్లుగా గుర్తించారు. మోహన్ కు చెందిన ఆస్తులుగా చెబుతున్న వాటిల్లో కొన్ని వివరాలు చూస్తే.. ఆదిమూలం అవినీతి రేంజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

= మాదాపూర్.. కోంపల్లి.. జూబ్లీహిల్స్.. బేగంపేట లో ఇంటి స్థలాలు

= జూబ్లీహిల్స్ లో సొంతిల్లు

= పంజాగుట్టలో 200 గజాల కంప్లెక్స్.. అపార్టుమెంట్

= బళ్లారిలో ప్రవేటు స్కూల్లో పెట్టుబడులు

= కరీంనగర్.. ఆదోని.. కడప.. అనంతపురంలోని గ్రానైటు కంపెనీల్లో వాటాలు

= రాజమండ్రిలోని శ్రీ తేజ బయోఫ్యూయల్స్ స్పిరిట్ ఫ్యాక్టరీలో మేజర్ వాటా

= కర్ణాటకలోని ఆర్ ఆర్ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు

= బెంగళూరు మైసూరు రోడ్డులో కంకర క్యారీ

= మైసూరు రోడ్డులో 24 ఎకరాల భూమి

= నెల్లూరులో ఉషోదయా ఎంటర్ ప్రైజస్ పేరుతో కోల్.. బ్రోకెన్ రైస్ అక్రమ రవాణావ్యాపారం

= ఎంఎస్ ఆర్ గ్రానైట్ లో వాటా తదిరాలు..