Begin typing your search above and press return to search.

క‌లెక్ట‌ర‌మ్మ‌కు క‌డియం ఇన్ డైరెక్ట్ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   12 Oct 2017 7:00 AM GMT
క‌లెక్ట‌ర‌మ్మ‌కు క‌డియం ఇన్ డైరెక్ట్ వార్నింగ్‌!
X
ప్ర‌జాప్ర‌తినిధుల‌కు.. కీల‌క అధికారులకు మ‌ధ్య ర‌చ్చ ప‌లుచోట్ల క‌నిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు.. అధికార‌ప‌క్షానికి చెందిన కొంద‌రు నేత‌ల‌కు ఏమాత్రం పొస‌గ‌టం లేదు. ఈ విష‌యంలో సీఎం కేసీఆర్ చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. స్థాయి దాటిన త‌ర్వాత తాను ఎంట‌ర్ అవ్వాల‌న్న‌ట్లుగా ఉంటున్నారు. దీంతో.. అటు అధికార‌ప‌క్ష నేతలు.. ఇటు కీల‌క అధికారుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోంది.

ఇటీవ‌ల జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డికి.. జిల్లా క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌కు మ‌ధ్య న‌డుస్తున్న వార్ తెలిసిందే. చెరువు శిఖాన్ని ఎమ్మెల్యే క‌బ్జా చేశారంటూ బహిరంగంగా వ్యాఖ్య‌లు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి జ‌నగామ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెంట‌నే బ‌తుక‌మ్మ కుంట మినీ ట్యాంక్ బండ్ వ‌ద్ద‌కు వెళ్లారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి క‌లెక్ట‌ర్ నిధులు ఇవ్వ‌టం లేద‌ని కంప్లైంట్ చేశారు. దీనికి బ‌దులిచ్చే స‌మ‌యానికి క‌డియం క‌లుగ‌జేసుకుంటూ త‌ర్వాత మాట్లాడ‌దామ‌ని వెళ్లిపోయారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో దేవ‌సేన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువు శిఖం భూమిని ఆక్ర‌మించుకున్నార‌ని.. చెరువు శిఖంలో ప్ర‌హ‌రీ క‌ట్ట‌డానికి వీల్లేద‌ని.. కానీ ఐదు ఎక‌రాల చెరువును పూడ్చేసిన వైనాన్ని పూస‌గుచ్చిన‌ట్లుగా చెప్పారు.

దేవ‌సేన మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. క‌ట్ చేస్తే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర డిఫ్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి రియాక్ట్ అయ్యారు. అధికారుల‌కు సుద్దులు చెప్పే రీతిలో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఉన్న‌ట్లే కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అధికారుల‌కు కూడా ఉంటుంద‌ని.. ఎవ‌రి ప‌రిధిలో వారు ఉండాల‌న్నారు. ఎక్క‌డ ఏది మాట్లాడాలో.. ఏది మాట్లాడ‌కూడ‌దో అధికారులు తెలుసుకోవాలంటూ క‌లెక‌ర్ట్ దేవ‌సేన‌ను ఉద్దేశించి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌పై అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసి చిన్న‌బుచ్చిన వేళ‌.. తాను నిధులు ఎందుకు ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఆ విష‌యాన్ని త‌ప్పని చెబుతున్న క‌డియం మాట‌లు విన్న‌ప్పుడు.. ఇదే సుద్దులు సొంత‌పార్టీ ఎమ్మెల్యేకు చెప్పి ఉంటే ఈ ర‌చ్చ ముగిసేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌లెక్ట‌ర్ మీద విమ‌ర్శ‌లు రోడ్డు మీద‌.. న‌లుగురి ముందు ప‌ట్టుకొని అడ‌గాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని..? కావాలంటే ప్రైవేటుగా పంచాయితీ పెట్టొచ్చు క‌దా? అదే జ‌రిగితే.. ఇష్యూ అక్క‌డితో ఆగేది కూడా.

కానీ.. న‌లుగురి ముందు క‌లెక్ట‌ర్ ప‌ని చేయ‌టం లేద‌న్న సంకేతాలు వెలువ‌డేలా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడిన‌ప్పుడు.. దానికి వివ‌ర‌ణ‌గా తాను ఎందుకు నిధులు ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని మీడియాతో చెప్పారు. మీడియాతో మాట్లాడి.. త‌మ పార్టీ ఎమ్మెల్యేను చుల‌క‌న చేస్తారా? అన్న ప్ర‌శ్నే క‌డియంది అయితే.. క‌లెక్ట‌ర‌మ్మ మీద ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్న మాట‌ను స‌ద‌రు ఎమ్మెల్యేకు క‌డియం చెప్పి ఉంటే.. ఈ వివాదం ఎప్పుడో ముగిసి ఉండేది కాదు. కానీ.. తాజాగా క‌డియం చేసిన ఇన్ డైరెక్ట్ వార్నింగ్ క‌లెక్ట‌ర‌మ్మ‌ను మ‌రింత చిన్న‌బుచ్చ‌టంతో పాటు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేసినా న‌డుస్తుంద‌న్న సంకేతాలు తాజా ఉదంతం ఇచ్చిన‌ట్లు అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. ఎంతో అనుభ‌వం ఉన్న క‌డియం లాంటోళ్లు తొంద‌ర‌ప‌డి అధికారుల‌ను త‌ప్పు ప‌డితే దాని ప్ర‌భావం ప్ర‌భుత్వం మీద ప‌డుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.