Begin typing your search above and press return to search.

పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామ‌న్నార‌ట‌!

By:  Tupaki Desk   |   18 Jun 2019 8:49 AM GMT
పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామ‌న్నార‌ట‌!
X
చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌త్య‌ర్థి పార్టీ ఎమ్మెల్యేల‌ను ఏ స్థాయిలో ప్ర‌లోభ పెట్టారో.. ఎంత దారుణాల‌కు ఒడిగ‌ట్టారో బ‌య‌ట‌పెట్టారు గూడురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వి. వ‌ర‌ప్ర‌సాద్. తాజాగా ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీని మారాల్సిందిగా కోరుతూ త‌న‌ను భారీగా ప్ర‌లోభ పెట్టిన‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. మాజీ సీఎం కుమారుడు.. మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చార‌న్నారు.

తాను ఆ రాజ్య‌స‌భ స‌భ్యుడి పేరు చెప్ప‌లేన‌ని వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతుండ‌గా.. వెనుక నుంచి క‌డ‌ప జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడ‌ని పెద్ద‌గా అర‌వ‌టంతో.. చెప్పేశార‌న్నారు. ఆ ఇద్ద‌రు క‌లిసి త‌న‌ను పార్టీ మారాల‌ని కోరార‌న్నారు. పార్టీ మారితే త‌న‌కు రూ.50 కోట్ల క్యాష్.. మ‌రో రూ.50 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. అంటే.. పార్టీ మారితే రూ.100 కోట్ల ఆఫ‌ర్ ను త‌న ముందుకు తెచ్చార‌న్నారు.

త‌న‌తో ఈ ఆఫ‌ర్ చెప్పే వేళ‌లో మ‌రో న‌లుగురు మంత్రులు కూడా ఉన్నార‌న్నారు. వారి ఆఫ‌ర్ ను తాను రిజెక్ట్ చేశాన‌న్నారు. క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయ‌టం మంచిది కాద‌ని వారికి చెప్పాన‌న్నారు. వారి పార్టీ కోసం వారు అంత‌లా ప్ర‌య‌త్నిస్తుంటే.. త‌మ పార్టీ కోసం తాము అంతే క‌మిట్ మెంట్ తో ఉండాలి క‌దా? అని వ్యాఖ్యానించారు.

ఎన్నిక‌ల వేళ టికెట్ల కోసం జ‌గ‌న్ ముందు చేతులు క‌ట్టుకొని నిలుచున్న అభ్య‌ర్థులు.. ఎమ్మెల్యేలు అయ్యాక 23 మంది పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌టం స‌రికాద‌న్న ఆయ‌న‌.. పార్టీని క‌న్న‌త‌ల్లిగా భావించి.. ఆలోచించి ఉంటే ఆ ఎమ్మెల్యేలు త‌ప్పు చేసి ఉండేవారు కాద‌న్నారు.

పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలూ ఏ ఆశ‌తో మారారో త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ప్పుడు అర్థ‌మైంద‌న్నారు. తాను నోరు తెరిచి మాట్లాడితే.. తెలుగుదేశం నేత‌లు అవ‌మానంతో చావాల్సిందేన‌న్న ఆయ‌న‌.. ఇన్ని దుర్మార్గాలు చేశారు కాబ‌ట్టే వారిని ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో తిర‌స్క‌రించార‌న్నారు.