Begin typing your search above and press return to search.

మరోసారి కేవీపీ నోటీస్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   26 July 2016 11:14 AM GMT
మరోసారి కేవీపీ నోటీస్ ఇచ్చారు
X
ఏపీ కాంగ్రెస్ నేతల్లో ఎవరికి రాని ఐడియా కేవీపీ రామచంద్రరావుకు వచ్చిందనే చెప్పాలి. ఏపీకి ప్రాణ సమానమైన ప్రత్యేక హోదా సాధనకు తనదైన శైలిలో వ్యవహరించి ఆయన.. మోడీ సర్కారుకు పెద్ద ఝులక్కే ఇచ్చారు. మిగిలిన వారి మాదిరి ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు.. ధర్నాలు.. నిరాహార దీక్షలు లాంటివి ఏమీ చేయకుండా కామ్ గా.. కేవీపీ ప్రైవేటు బిల్లు పెట్టారు. ఇది కాస్తా మోడీ సర్కారుకు బోలెడంత కష్టాన్ని తెచ్చి పెట్టింది.

తమకెంతో కీలకమైన జీఎస్టీ బిల్లును ఈ సమావేశాల్లోనే పూర్తి చేయాలని భావించిన మోడీ అండ్ కోకు.. కేవీపీ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు కాంగ్రెస్ చేతికి కొత్త అస్త్రంగా మారిన పరిస్థితి. జీఎస్టీ బిల్లును పాస్ చేయించుకొని క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మోడీ సర్కారుకు.. ఏపీ ప్రత్యేక హోదా బిల్లుతో తాము చెప్పినట్లు చేయాలంటూ కాంగ్రెస్ బేరం ఆడేందుకు కేవీపీ ప్రైవేటు బిల్లు అవకాశమిచ్చింది.

కేవీపీ బిల్లును తప్పించుకునేందుకు మోడీ సర్కారు ఎన్ని తిప్పలు పడుతుందో గడిచిన కొద్దిరోజులుగా చూస్తున్నదే. ఇదేఅవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఊహించని విధంగా తమకు అస్త్రంగా మారిన కేవీపీ ప్రైవేటు బిల్లు విషయంలో వచ్చే మైలేజీని మిస్ చేసుకోవటానికి కాంగ్రెస్ అస్సలు ఇష్టపడటం లేదు. విభజన నిర్ణయం ఏపీలో పార్టీకి శాపంగా మారిన నేపథ్యంలో..ఆ శాప విమోచనానికి కేవీపీ ప్రైవేటు బిల్లు ఎంతో కొంత మేలు చేస్తుందన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే కలుగుతోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా కేవీపీ మోడీ సర్కారు మీద మరో అస్త్రాన్ని సంధించారు. ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారంటూ ఆయన తాజాగా సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తన హక్కులకు భంగం కలిగించారని ఆయన నోటీసు సందర్భంగా పేర్కొన్నారు. మొత్తానికి నోటీసుల మీద నోటీసులతో బీజేపీ నేతలకు కేవీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.