Begin typing your search above and press return to search.

కేవీపీ మాటః జ‌గ‌న్ లేకుండా నేనెలా ఉంటా?

By:  Tupaki Desk   |   30 May 2016 5:19 AM GMT
కేవీపీ మాటః జ‌గ‌న్ లేకుండా నేనెలా ఉంటా?
X
కేవీపీ రామచందర్ రావు...తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల గురించి కాస్తంత‌ అవ‌గాహ‌న ఉన్న‌వారికి కూడా ఈ పేరు సుప‌రిచితం. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్‌ రెడ్డి ఆత్మ‌గా పేరొందిన వ్యక్తి కేవీపీ. ఈ సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త వైఎస్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుటుంబానికి దూర‌మ‌య్యారు. కాంగ్రెస్ వాదిగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారే త‌ప్ప త‌న ఆప్త‌మిత్రుడి కొడుకు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో చేర‌లేదు. అయితే తాజాగా ఓ టీవీ చాన‌ల్‌ తో మాట్లాడుతూ కేవీపీ వైఎస్ జగ‌న్‌ పై ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

"జగన్ మోహన్ రెడ్డి అనేవాడు నా మేనల్లుడు అండి.వాడు లేకుండా ఎట్లా ఉంటాను? నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం ప్రకారం జగన్ మోహన్ రెడ్డి లో ఏ దోషం లేదు. జగన్ దోషి అనటానికి మ‌న‌మెవ‌రం అండి? ఏ హక్కు ఉంది? ఆ విషయం న్యాయ‌స్థానం ప‌రిధిలో ఉంది. అక్క‌డే తేలుతుంది" ఇది వైఎస్ జ‌గ‌న్ గురించి కేవీపీ చెప్పిన మాట‌. ఇక కేవీపీ వ్య‌క్తిగ‌త అభిప్రాయం జ‌గ‌న్ గురించి చెప్ప‌మ‌ని ప్రశ్నించగా ... "నాకు తెలిసినంత మేర‌కు వైఎస్ జ‌గ‌న్ ఏ అంశాల్లోనూ ప్ర‌మేయం క‌ల్పించుకోలేదు, ఆయ‌న అవినీతికి పాల్ప‌డ‌లేదు" అని కేవీపీ తేల్చిచెప్పారు.

ఇటీవ‌లి కాలంలో ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి పూర్తిగా అడ్ర‌స్ గ‌ల్లంత‌యిపోయిన‌ట్లుగా మారింది. ఈ నేప‌థ్యంలో కేవీపీ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. జ‌గ‌న్‌ కు కేవీపీ ఇలా కితాబివ్వ‌డం వెనుక వైసీపీలో చేరే ఎజెండా ఏమైనా ఉందా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.