Begin typing your search above and press return to search.

ఇమేజ్ డ్యామేజ్ చేసిన కేటీఆర్ ట్వీట్లు!

By:  Tupaki Desk   |   23 April 2019 4:59 AM GMT
ఇమేజ్ డ్యామేజ్ చేసిన కేటీఆర్ ట్వీట్లు!
X
ట్వీట్లు మేలు కాదు చేటు చేయ‌టం తెలిసిందే. కాకుంటే.. ఎప్పుడూ ఇరుక్కుపోని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాత్రం తాజా ట్వీట్లు ఇబ్బందికి గురి చేశాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. సూటిగా చెప్పాల్సిన విష‌యాన్ని చెప్పేసే కేటీఆర్.. త‌న ట్వీట్ల‌తో త‌న ఇమేజ్ ను అంత‌కంత‌కూ పెంచుకున్నారే చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన ట్వీట్లతో లాభ‌మే త‌ప్పించి న‌ష్టం జ‌రిగింది లేదు.

కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్న‌మైన అనుభ‌వం కేటీఆర్ కు ఎదురైంద‌ని చెప్పాలి. ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌తో చోటు చేసుకున్న లోపాలు.. మార్క్ షీట్స్ విష‌యంలో దొర్లిన త‌ప్పులు ప‌లువురు విద్యార్థుల ప్రాణాలు పోయేలా చేశాయ‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. 10 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు సంబంధించిన విష‌యంలో ప్ర‌భుత్వం ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ.. అలాంటిదేమీ లేని రీతిలో ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హ‌రించింద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.

ఇంట‌ర్ బోర్డు నిర్వాకంతో కేసీఆర్ ప్ర‌భుత్వం ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. దీనికి త‌గ్గ‌ట్లే రోజులు గ‌డిచేస‌రికి ఇంట‌ర్ బోర్డు ద‌గ్గ‌ర ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారుతోంది. శ‌నివారంతో పోలిస్తే సోమ‌వారం పెద్ద ఎత్తున త‌ల్లిదండ్రులు.. విద్యార్థులు ఇంట‌ర్ బోర్డు ద‌గ్గ‌ర‌కు రావ‌టం.. విప‌క్షాల ఎంట్రీతో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డిలో ఇంట‌ర్ బోర్డు దారుణంగా ఫెయిల్ అయ్యింద‌న్న విష‌యంలో మ‌రో మాట లేదు. ఇలాంటివేళ‌.. ప్ర‌భుత్వంలో దొర్లిన త‌ప్పుల్ని ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌భుత్వానికి సూచ‌న రూపంలో ట్వీట్ చేయాల్సిన కేటీఆర్.. అందుకు భిన్నంగా ట్వీట్ చేయ‌టంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు.

ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డి విష‌యంలో ఆందోళ‌న వ‌ద్దంటూ కేటీఆర్ ట్వీట్ ను త‌ప్పు ప‌డుతున్నారు. దారుణ‌మైన త‌ప్పులు జ‌రిగిన త‌ర్వాత ఆందోళ‌న ప‌డొద్ద‌ని కేటీఆర్ ఎలా చెబుతార‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. రీవెరిఫికేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్న ఉచిత స‌ల‌హా మీద ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత గొప్ప‌గా ఐడియా ఇస్తున్న పెద్ద‌మ‌నిషి.. క‌నీసం రీవెరిఫికేష‌న్ కు ఫీజును ర‌ద్దు చేయాలంటూ ప్ర‌భుత్వానికి ఏమైనా సూచ‌న చేశారంటే అదీ లేదు.

విద్యార్థులు.. ప్ర‌జ‌ల ప‌క్షాన కంటే కూడా.. ప్ర‌భుత్వాన్ని వెన‌కేసుకొచ్చేలా పెట్టిన ట్వీట్లు నెగిటివ్ గా మారాయి. వాస్త‌వానికి ఈ అంశంపై కేటీఆర్ మౌనంగా ఉంటే స‌రిపోయేద‌ని.. అన‌వ‌స‌రంగా ట్వీట్లు చేసి మ‌రీ కెలుక్కున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్తం కావ‌టం విశేషం. సాంకేతికంగా కూడా కేటీఆర్ ట్వీట్లు అర్థం లేనివిగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అధిక‌ర పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయ‌న‌.. పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించి.. ఇరు వ‌ర్గాల మ‌ధ్య సంధి కుద‌ర్చ‌ట‌మో లేదంటే.. అధికారుల త‌ప్పును ప్ర‌భుత్వం ఎలా క‌రెక్ట్ చేయాల‌న్న సూచ‌న చేస్తే బాగుండేద‌ని.. అందుకు భిన్నంగా ప్ర‌భుత్వ చ‌ర్య‌ల గురించి ప్ర‌స్తావించ‌టంలో అర్థం లేదంటున్నారు.

ఇంట‌ర్ బోర్డు వ్య‌వహారంలో ప్ర‌భుత్వం అడ్డంగా ఫెయిల్ కావ‌ట‌మే కాదు.. డ్యామేజ్ కంట్రోల్ కూడా చేయ‌లేక‌పోయింద‌న్న మాట వినిపిస్తోంది. ఇంత‌కీ కేటీఆర్ ను ట్ర‌బుల్స్ లో ప‌డేసిన ట్వీట్లు చూస్తే.. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఏ ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఒక ట్వీట్ చేశారు. మ‌రో ట్వీట్ లో.. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నేడు సమీక్షించారు. ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు విద్యార్థుల‌కు కానీ వారి త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌ను అర్థం చేసుకునేలా లేవ‌న్న‌ది విమ‌ర్శ‌. అంతేకాదు.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వ‌కున్నా.. ప్ర‌భుత్వ త‌ప్పుల్ని సరిదిద్దుతున్నాం.. మీకు మేమున్నామ‌న్న నైతిక స్థైర్యాన్ని ఇచ్చేలా కేటీఆర్ ట్వీట్లు లేవ‌న్న మాట ప‌లువురి నోట వెంట రావ‌టం గ‌మ‌నార్హం.