Begin typing your search above and press return to search.

కేటీఆర్...వారం రోజుల అప‌ద్ద‌ర్మ సీఎం!

By:  Tupaki Desk   |   22 Jun 2017 11:16 AM GMT
కేటీఆర్...వారం రోజుల అప‌ద్ద‌ర్మ సీఎం!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు త‌న‌యుడు మంత్రి కేటీఆర్ కొత్త బాధ్య‌త‌లు ఎత్తుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కేబినెట్‌ లోని కీల‌క పోర్ట్‌ ఫోలియోల‌కు బాధ్యుడిగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు అపద్ధ‌ర్మ సీఎం బాధ్య‌త‌ల‌ను సైతం స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న తండ్రి రాష్ట్రంలోని అందుబాటులో లేని స‌మ‌యంలో ఆయ‌నే సీఎం ప‌ర్య‌వేక్షించే కార్య‌క‌లాపాల‌ను స‌మ‌న్వయం చేయ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఇది అప్ర‌క‌టితంగా అమ‌లు అవుతోంద‌ని తెలుస్తోంది.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజ‌ర‌య్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. దాదాపుగా వారం రోజుల పాటు ఆయ‌న ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌ కు అప‌ద్ధ‌ర్మ సీఎం బాధ్య‌త‌లు అప్ర‌క‌టితంగా అప్ప‌గించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. కేసీఆర్‌ అత్యంత‌ కీల‌క‌మైన అంశాలుగా భావించే హ‌రిత‌హారం - మిష‌న్ భ‌గీర‌థ స‌హా ప్ర‌స్తుతం సాగుతున్న గొర్రెల పంపిణీ వ్య‌వ‌హ‌రాన్ని ప్ర‌తినిత్యం స‌మీక్షించాల‌ని కేటీఆర్‌ కు ఆదేశించిన‌ట్లు స‌మాచారం ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - డీజీపీ స‌హా ఇత‌ర అధికారుల‌తో స‌మన్వ‌యం చేసుకోవాల‌ని సీఎం కేసీఆర్ తెలిపిన‌ట్లు స‌మాచారం. కాగా, కేటీఆర్‌ కు ఇలాంటి బాధ్య‌త‌ల గురించి తెలియ‌జెప్ప‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని, గ‌తంలోనూ ఇలాంటి సూచ‌న‌లు కేసీఆర్ చేశార‌ని ప‌లువురు అంటున్నారు.

మ‌రోవైపు సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని టీఆర్‌ ఎస్ ఎంపీ జితేందర్‌ రెడ్డి చెప్పారు. శుక్రవారం పార్లమెంటులోని లోక్‌ సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో సీఎంతోపాటు ఎంపీలు కే కేశవరావు - జితేందర్‌ రెడ్డి - వినోద్‌ కుమార్ తదితరులు కూడా పాల్గొంటారు. కేకే గురువారం మధ్యాహ్నం ఢిల్లీ రానున్నారు. కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని సైతం హాజరుకానున్నందున కొద్దిసేపు ఆయనతో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. పరోక్ష పన్నుల విధానంలో విప్లవాత్మక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ లో జరిగే కార్యక్రమంలో అవకాశాన్నిబట్టి సీఎం కూడా పాల్గొంటారని జితేందర్‌ రెడ్డి తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి సెంట్రల్‌ హాల్‌ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఆహ్వానం పంపిందని జితేందర్‌ రెడ్డి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు మంజూరు చేయడానికి సానుకూల నిర్ణయం తీసుకున్నందువల్ల స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని సీఎం ఇటీవల హైదరాబాద్‌ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/